ఈరోజుల్లో ఒక సినిమా 2 వారాల పాటు థియేటర్లలో నిలబడటమే చాలా గొప్ప విషయంగా మారిపోయింది. ఒకప్పుడు 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు అంటూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు.
ఇప్పుడు మాత్రం రూ.50 కోట్లు, రూ.100 కోట్లు, రూ.200 కోట్లు అంటూ చెప్పుకునే స్థాయికి వచ్చేసాం.ఈ ఓటీటీల కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా సరే.. 4 వారాల పాటు థియేటర్లలో నిలబడటమే గొప్ప విషయం.
పండుగ టైంలో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి కూడా ఇంతే. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) సినిమా మాత్రం నిలకడగా 50 రోజులు ఆడింది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా నేటితో అంటే మార్చి 2వ తేదీతో విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంటుంది.ఏకంగా 109 కేంద్రాల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ 50 రోజులు ఆడిందని పీఆర్ టీం అధికారికంగా ప్రకటించడం జరిగింది.
అయితే ఇవి డైరెక్ట్ సెంటర్స్ లో కాదు. షిఫ్ట్..లు వంటి వాటితో కలుపుకుని ఈ ఫీట్ సాధించిందని తెలుస్తుంది. ఏదేమైనా ఇది గొప్ప విషయమే. అనిల్ రావిపూడి గత సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా 92 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఇప్పుడున్న దర్శకుల్లో అనిల్ రావిపూడికి మాత్రమే ఈ రికార్డు సాధ్యమైంది అని చెప్పాలి.ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ కూడా అతిథి పాత్రలో మెప్పించారు. భీమ్స్ సంగీతం అందించాడు.