సినిమా బడ్జెట్ల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రోజుకి ఇంత ఖర్చు పెడుతున్నారు, సినిమా ఇంత పెడుతున్నారు, రెమ్యూనరేషన్లు భారీగా ఉంటున్నాయి అంటూ పెద్ద లెక్కలేస్తున్నారు. చిన్న సినిమాలకు కూడా ఇదే పరిస్థితి. అలాంటి ఈ రోజుల్లో ఓ సినిమాను రూ.33 వేలకే తీసేశారు అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. ఏంటి జోక్ చేస్తున్నారా అని అనుకుంటున్నారా? జోక్ కాదు ఆ పని చేసి చూపించింది ఎవరో కాదు రాహి అనిల్ బార్వీ.
రాహి అనిల్ బార్వీనా.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. ‘తుంబాడ్’ లాంటి మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మనకు అందించిన దర్శకుడే ఆయన. ఆయనే ఇప్పుడు రూ.33 వేలకు సినిమా తీశారు. అంతేకాదు సినిమాను ఇప్పుడు రిలీజ్కి రెడీ చేసేశారు కూడా. ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. ‘మన్ పిశాచ్’ పేరుతో రూపొందిన ఈ సినిమాలో యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే మాత్రమే నటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్ంగా ఈ విషయాలు తెలిసేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
80 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేశారట. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సినిమాను సిద్ధం చేశారట. స్క్రిప్ట్ కేవలం 60 పేజీలేనట. ఐఫోన్తో తీసిన వీడియోలు, ఫొటోషాప్, ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటివి వాడి సినిమాను పూర్తి చేశామని దర్శకుడు తెలిపారు. ఇక కథ విషయానికొస్తే.. హడమ్ గావ్ అనే ఊరికి పురావస్తు శాఖకు చెందిన ఆఫీసర్ సదాశివరావ్ వెళ్తాడు. కొండలో నుంచి బయటపడిన పెద్ద గుమ్మటం రహస్యం తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు.
ఈ క్రమంలో ఆ ఊళ్లో నివశిస్తున్న సావిత్రి అనే యువ వితంతువు ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. చీకటి పడగానే విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకునే హడమ్ గావ్లో అతనికి ఎదురైన అనుభవాలే స్టోరీ. ఈ సినిమాను మార్చి 18న యూట్యూబ్లో నేరుగా విడుదల చేస్తున్నారు.