నందమూరి వారసుడి రాక కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వస్తాడు.. వస్తున్నాడు అనే వార్తలే తప్ప, సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు. ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్న ఈ వ్యవహారంపై తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి. మోక్షజ్ఞతో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ చేస్తానని ఆయన ప్రకటించడంతో అసలు కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది.
ADITYA 999
సాధారణంగా వారసుల ఎంట్రీ అంటే సేఫ్ జోన్లో లవ్ స్టోరీనో, ఫ్యామిలీ ఎంటర్టైనరో ప్లాన్ చేస్తారు. కానీ బాలయ్య మాత్రం తన కొడుకు కోసం అత్యంత రిస్క్ ఉన్న సైన్స్ ఫిక్షన్ జోనర్ను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడో వచ్చిన క్లాసిక్ ‘ఆదిత్య 369’కు సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పలేం. తొలి సినిమాకే ఇంత బరువైన బాధ్యతను మోక్షజ్ఞ మోయగలడా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
మొన్నటి వరకు ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది. అది దాదాపు ఖాయం అనుకున్న టైమ్లో, బాలయ్య మళ్ళీ పాత పాటే పాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. బయట దర్శకులు తెస్తున్న కథలు నచ్చకనో, లేక తన కొడుకును తన డైరెక్షన్లోనే పరిచయం చేయాలనే పట్టుదల వల్లో.. బాలయ్య తానే రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతోంది.
నిజానికి ఈ ప్రాజెక్ట్ గురించి బాలయ్య చెప్పడం ఇదేం కొత్త కాదు. ఎప్పటి నుంచో ఈ స్క్రిప్ట్ రెడీగా ఉందని అంటున్నారు కానీ, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ మాత్రం లేదు. ఒకవేళ ఇదే డెబ్యూ అయితే, విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం కోసం చాలా సమయం పడుతుంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఆలస్యం అయినట్లేనా? అనే సందేహాలు అభిమానులను తొలిచేస్తున్నాయి.
మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ వ్యవహారం ‘ఆదిత్య 369’లోని టైమ్ మెషీన్లా ఎప్పుడు ఏ కాలానికి వెళ్తుందో తెలియని అయోమయ స్థితిలో పడింది. ఇక ఈ కన్ఫ్యూజన్కు ఎండ్ కార్డ్ పడి, అధికారికంగా పోస్టర్ రిలీజ్ అయ్యే రోజు కోసం నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.