మృణాల్ ఠాకూర్ మనకు నాలుగేళ్లుగా తెలుసు కానీ.. ఆమె సినిమాల్లోకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది తెలుసా? 21 ఏళ్ల వయసులోనే ఆమె తొలి సినిమాలో నటించింది. అయితే సరైన బ్రేక్ రావడానికి అన్నేళ్లు పట్టింది. అవకాశాల కోసం ఆమె తొలి నాళ్లలో ఎన్ని ఇబ్బందులు పడింది అనే వివరాలను ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సుమారు ఏడేళ్లు ఆమె సినిమా కష్టాలు సాగాయి అని చెప్పొచ్చు.
కెరీర్ ప్రారంభించినప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి అని చాలా రకాలుగా అనుకుందట మృణాల్. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కావని చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలోకి బయటి వ్యక్తిగా అడుగుపెట్టడం, అవకాశాలు అందుకోవడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. బాలీవుడ్లో నా తొలి రోజులు కష్టంగా గడిచాయి. అడ్డంకులను దాటుకొని నటిగా ఎదగడానికి ఏం చేయాలనేది నేర్చుకున్నాను అని చెప్పింది.
తన రీసెంట్ సినిమా ‘దో దీవానే సెహర్ మే’ కూడా అంత ఈజీగా తన వరకు రాలేదని.. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆ సినిమా అవకాశం వచ్చిందని చెప్పింది. చిత్ర దర్శకుడు రవి ఉడ్యవార్ని నేరుగా సంప్రదించి సినిమా చేస్తానని అడిగి, ఒప్పించి మరీ చేసిందట. ‘మామ్’ సినిమా చూసిన తర్వాత ‘నేను మీతో పనిచేయాలనుకుంటున్నా’నని అడిగిందట. అలా సినిమా ఛాన్స్ అడిగి తీసుకున్నా ని చెప్పింది.
పని కోసం తాను సంప్రదించిన మొదటి దర్శకుడు ఆదిత్య ధర్ అని చెప్పింది మృణాల్. అలా అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ అవకాశాలు తేలికగా రాలేదని తెలిపింది. అవకాశాల్ని సృష్టించుకోవాలి అనే మాటను నేను నమ్ముతాను. వాటి కోసం వెంబడించాలి. దర్శకులు నా వైపు చూసేలా నేనే చేసుకోవాలి.
ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుపడను. ఎందుకంటే నటనంటే అమితమైన ప్రేమ. ఎలాంటి సంకోచం లేకుండా అవకాశాల కోసం అడిగాను, అడుగతున్నాను, అడుగుతాను అని చెప్పింది. స్టార్ స్టేటస్ వచ్చినా ఇంకా అవకాశాల కోసం వెంటపడటం ఏంటి అనేదే అర్థం కావడం లేదు.