సౌత్ హీరోయిన్లు బాలీవుడ్కి వెళ్లి సినిమాలు చేయడం చాలా తక్కువ. పాన్ ఇండియా ఫీవర్ మొదలయ్యాక ఇలా వెళ్లిన హీరోయిన్లలో రష్మిక మందన తప్ప మిగిలిన ఎవరూ అంతగా రాణించింది లేదు. తొలినాళ్లలో ఆమెకు కూడా మంచి విజయాలు దక్కలేదు. కానీ సౌత్ దర్శకుల బాలీవుడ్ సినిమాలతో రాణించి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉందో ఏమో.. కీర్తి సురేశ్ కూడా బాలీవుడ్ సినిమాలను ఇప్పట్లో వదలను అనేలా ట్రై చేస్తోంది. ఈ క్రమంలో ఓ సినిమా ఛాన్స్ పట్టేసింది అని తెలుస్తోంది.
Keerthy Suresh
‘తెరి’ సినిమా బాలీవుడ్ రీమేక్ ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్కి వెళ్లిన కీర్తి సురేశ్.. ఆ సినిమా ఫలితం ఇబ్బంది పెట్టడంతో మరోసారి అటువైపు చూడదు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆమె టైగర్ ష్రాఫ్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది అని అంటున్నారు. టైగర్ మార్క్ యాక్షన్ సినిమాలో కీర్తి సురేష్ నటించనుందని బాలీవుడ్ టాక్. ఈ సినిమా కూడా సౌత్ సినిమా టచ్లోనే ఉండబోతోందని సమాచారం. మరి రెండో సినిమాతో అయినా కీర్తి నిలదొక్కుక్కుంటుందేమో చూడాలి.
ఇక కీర్తి సౌత్ సినిమాల గురించి చూస్తే.. పెళ్లి తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఫుల్ స్పీడ్లో దూసుకుపోతోంది. తెలుగులో విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘దసరా’ సినిమాలో పాత్రను ఈ పాత్ర పోలి ఉంటుందని చెబుతున్నారు. ఇది కాకుండా ఆమె చేతిలో తమిళంలో ‘కన్నెవెడి’ అనే సినిమా చేస్తోంది. మలయాళంలో మూడేళ్ల తర్వాత ‘తొట్టమ్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా ‘అక్క’ అనే ఓ వెబ్సిరీస్లో రాధికా ఆప్టేతో కలసి నటించింది. నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ కానున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటిస్తారు. ఇది రెగ్యులర్ వెబ్సిరీస్లా ఉండదని ‘అక్క’ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.