సినిమా హీరో, దర్శకుడు, కథ ఇవ్వని విజయాన్ని సీజన్ ఇస్తుందా? నిజానికి ఈ మాట అగానే ‘నీకేమైనా పిచ్చా.. అవన్నీ కాకుండా సీజన్ విజయం ఎలా అందిస్తుంది?’ అని అంటారు. కానీ సెంటిమెంట్లకు బాగా విలువ ఇచ్చే సినిమా పరిశ్రమలో ఇలా ఆలోచించే వాళ్లు ఉన్నారు. ఇలా అనుకుంటున్నారో, లేక షూటింగ్కి అన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ.. సంక్రాంతికి వచ్చి హ్యాట్రిక్ కొట్టిన యువ హీరో – హిట్ ముఖం చూసి చాలా రోజులు అయిన సీనియర్ దర్శకుడు తమ సినిమా సంవత్సరం తర్వాత తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.
సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టారు అంటే మీకు అర్థమై ఉంటుంది ఆ హీరో ఎవరో. ‘రన్ రాజా రన్’, ‘శతమానంభవతి’, ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ హ్యాట్రిక్ కొట్టిన శర్వానందే ఆ హీరో. ఇక వరుస ప్రయత్నాల్లో ఇబ్బందికర ఫలితాలు అందుకున్న శ్రీను వైట్లనే ఆ దర్శకుడు. ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే ఆ సినిమా ఉంటుంది అని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు ‘నారీ నారీ నడుము మురారి’ సినిమా విజయం తర్వాత శ్రీను వైట్ల ఆనందం చూస్తే ఈ విషయంలో స్పష్టత వచ్చేసింది.
‘ఢీ 2’ అంటూ సీక్వెల్ కోసం చాలా ప్రయత్నాలు చేసిన శ్రీను వైట్ల.. ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో గోపీచంద్తో ‘విశ్వం’ సినిమా చేశారు. ఆ సినిమా చాలా కష్టాలు పడి, నిర్మాత మారి ఆఖరికి విడుదలైంది. అయితే ఫలితం తేడాకొట్టింది. ఆ తర్వాత వివిధ ప్రయత్నాలు చేశాక శర్వా ఓ కథకు ఓకే చెప్పాడు. ఆ సినిమానే వచ్చే సంక్రాంతికి తీసుకొస్తారట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. గతంలో ఉన్న డీల్ మేరకే శ్రీను వైట్ల ఆ బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నారట. చూద్దాం మరి ఈసారి శర్వా సెంటిమెంట్ కుదిరి శ్రీను వైట్లక విజయం దక్కుతుందేమో.
