తమ ప్రైవసీకి భంగం కలుగుతోంది, తమ అనుమతి లేకుండా వీడియోలను మార్ఫింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సిద్ధం చేస్తున్నారు.. దీన్ని అడ్డుకోండి అంటూ తెలుగు సినిమాల హీరోలు వరుస పెట్టి దిల్లీ హైకోర్టు తలుపుతడుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా, ఈ కామర్స్ వెబ్సైట్లలో చేస్తున్న పోస్టుల కారణంగా తమ వ్యక్తిగత హక్కులు దెబ్బ తినకుండా రక్షణ కల్పించాలని వరుసగా హీరోలు, నటులు కోర్టును ఆశ్రయించారు. కొంతమంది విషయంలో తీర్పులు కూడా వచ్చాయి. అయితే తొలిసారి కోర్టులో మరో పాయింట్ చర్చలోకి వచ్చింది.
ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున తరహాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, కథానాయకుడు పవన్ కల్యాణ్.. మరో నటుడు ఎన్టీఆర్ దిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ మన్ప్రీత్ ప్రీతమ్ సింగ్ అరోడా ఇటీవల విచారణ జరిపారు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు, పేర్లను వాణిజ్య అవసరాలు, తప్పుడు ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో దుర్వినియోగం చేస్తున్న వాటిని అడ్డుకోవాలని వారి తరఫున వాదనలు వినిపించిన సాయి దీపక్ న్యాయమూర్తిని కోరారు.
ఈ మేరకు కొన్ని సాక్ష్యాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లిప్క్టార్, అమెజాన్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, గూగుల్లో ఉన్న ఇలాంటి పోస్టులను తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కూడా కోరారు. ఈ వాదనలపై ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు ఇది వరకు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి వివాదాస్పద యూఆర్ఎల్స్ను తొలగించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏదైనా యూఆర్ఎల్ / కంటెంట్ను తొలగించాలని ఆదేశాలిచ్చేటప్పుడు వాటిని పోస్ట్ చేసిన వినియోగదారుల వాదనలూ వినాల్సి ఉంటుందని అన్నారు.
ఇకపై ఎవరైనా నెటిజన్లు సెలబ్రిటీలు/ హీరోల వీడియోలు, కంటెంట్ను పోస్ట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ స్పష్టంగా డిస్క్లైమర్ ముద్రించాలని సూచించారు. సెలెబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే జరిగే పరిణామాల గురించి తమ వినియోగదారులకు గూగుల్ చెప్పాలని సూచించారు. ఆ తర్వాత కూడా ఎవరైనా అలా నడుచుకుంటే వారి ఖాతాలను సస్పెండ్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. పవన్, ఎన్టీఆర్ పిటిషన్లలో ప్రస్తావించిన వివాదాస్పద పోస్టులకు సంబంధించిన ఐపీ లాగిన్ వివరాలను మూడు వారాల్లో సమర్పించాలని ప్రతి వాదులకు కోర్టు ఆదేశించింది.