నిషిత్‌, రవి వర్మ మరణం నన్ను కలిచి వేసింది : పవన్ కళ్యాణ్

  • May 10, 2017 / 10:37 AM IST

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌‌  రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. ఈరోజు ఉదయం నారాయణ కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. “ఎంతో భవిష్యత్‌ ఉన్న నిషిత్‌, అతడి స్నేహితుడు రాజా రవి వర్మ దుర్మరణం చెందడం దురదృష్టకరం. వారి మృతదేహాలను చూశాను, వారి కుటుంబసభ్యుల కన్నీరు నాకు తీవ్ర మనోవేదనను కలిగించింది. చెట్టంత కుమారుడు కళ్లెదుటే కనుమరుగయ్యే పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు” అని ఆవేదన చెందారు. “మనం సాంకేతికంగా ఎదుగుతున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు లేని ప్రజా జీవనం కోసం మనమంతా కృషి చేయాలి. నిషిత్‌, రవివర్మల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విపత్తును తట్టుకునే స్థైర్యాన్ని నారాయణకు, రవివర్మ తండ్రి  కృష్ణకు ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

నిషిత్‌, రవివర్మల కుటుంబాలకు నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నానని” పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రిలో నిషిత్‌‌ మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం అంబులెన్స్‌లో బంధువులు మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. నిషిత్‌ తండ్రి నారాయణ లండన్‌ నుంచి బయలుదేరారని.. ఈ రాత్రికి చెన్నైకి చేరుకుంటారని బంధువులు చెబుతున్నారు. రేపు నారాయణ కళాశాల క్యాంపస్‌లో నిషిత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus