సినిమా పరిశ్రమలో అందరూ బంధువులే.. కానీ అది అవసరం ఉన్నంతవరకే అంటారు. ఈ మాట మేం అన్నది ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సీనియర్లు చెప్పేమాట. ఇదెంత నిజం అని అడిగితే చెప్పలేం కానీ.. ఇంచుమించు ఇదే పరిస్థితి తాను ఎదుర్కొన్నాను అంటూ ఓ సీనియర్ నటుడు మాట్లాడటం ఇప్పుడు వైరల్గా మారింది. ఈ మాటలు అన్నది ప్రముఖ బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజ్పాల్ యాదవ్. ఇటీవల చెక్ బౌన్స్ కేసులో ఆయన కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.
ఓ చెక్ బౌన్స్ కేసులో మరికొంత సమయం కావాలని రాజ్పాల్ యాదవ్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో తీహార్ జైలులో ఆయన లొంగిపోయారు. ఈ క్రమంలో తన ఆర్థిక ఇబ్బందుల గురించి, జైలు అధికారులతో ఆయన పంచుకున్నారు. ఈ విషయంలో లొంగిపోవడం తప్ప తనకు మరో అవకాశం లేదని కూడా చెప్పారు. ఆ విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
నా దగ్గర డబ్బు లేదు. స్నేహితులు కూడా లేరు. అందుకే లొంగిపోవడం తప్ప మరొక మార్గం కనిపించలేదు. అందుకే లొగిపోయాను అని రాజ్పాల్ యాదవ్ చెప్పారని సమాచారం. సినిమా పరిశ్రమలో ఎవరినీ సాయం అడగకూడదని అనుకున్నానని కూడా చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి పరిశ్రమలో ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు.
అసలేమైందంటే.. రాజ్పాల్ యాదవ్, ఆయన భార్య రాధా యాదవ్పై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి ఇచ్చిన కొన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయని ఫిర్యాదులో చేసింది. ఈ విషయంలో 2018లో ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి రాజ్పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2019లో సెషన్స్ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ రాజ్పాల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ శిక్షపై 2024లో తాత్కాలిక స్టే ఇచ్చి రాజీకి వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడికి డబ్బు తిరిగి చెల్లిస్తానని రాజ్పాల్ కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ ఆ మాట నెరవేరలేదు. దీంతో ఇప్పుడు లొంగిపోయారు.