ఇండియన్ సినిమాలో ‘రామాయణ’ సినిమా గురించి గత కొన్నేళ్లుగా రకరకాల వార్తలు, చర్చలు, పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది దర్శకనిర్మాతలు ఈ ఇతిహాసాన్ని వెండితెరపైకి మరోసారి తీసుకురావాలని ప్రయత్నించారు. కొంతమంది విజయవంతమై సినిమాను రిలీజ్ చేశారు. మరికొందరు సగం సినిమా చేసి ఆపేశారు. మరి కొందరు ప్రారంభ దశలోనే నిలిపేశారు. ఇప్పటికీ ఇంకొంతమంది రామాయణాన్ని సినిమాగా తెరకెక్కిద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు. అయితే మధ్యలో ఆగిపోయిన ఓ సినిమా గురించి ఇప్పుడు చర్చ మళ్లీ బయటకు వచ్చింది.
సల్మాన్ ఖాన్తో, ఆయన సోదరుడు సోహైల్ ఖాన్ కలసి ‘రామాయణ’ సినిమాను ప్రారంభించారు. సోనాలీ బింద్రేను సీతగా ఎంపిక చేశారు. 90వ దశకంలో ఆ సినిమా ప్రారంభమై.. 40 శాతం చిత్రీకరణ కూడా జరుపుకుంది. సినిమా అనుకున్నట్లుగా వస్తోంది అని అనుకుని సల్మాన్ ఖాన్ అప్పట్లో ఎంతో ఆనందంగా సినిమాను ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే సమస్యల్లా మరో నటి పూజా భట్ – సోహైల్ ఖాన్ వల్ల వచ్చింది. ఈ సినిమా ప్రయాణంలో సోహైల్, పూజ మధ్య రిలేషన్ ఏర్పడింది.
సోహైల్ తండ్రి ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్కు ఈ విషయం తెలియడంతో సోహైల్తో పెద్ద వాదనే జరిగింది. పూజా భట్తో రిలేషన్ వద్దు అనేది సలీమ్ వాదన. కానీ సోహైల్ వినలేదు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో సినిమా ఆగిపోయింది. అలా ఆ ‘రామాయణ’ నిలిచిపోయింది. ఆ తర్వాత సల్మాన్ కొన్నిసార్లు ప్రయత్నించినా సినిమా ప్రారంభమవ్వలేదు. ఇప్పుడు ఇన్నేళ్లకు బాలీవుడ్లో మరో ‘రామాయణ’ మొదలైంది.
నితేశ్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ’లో రణ్బీర్ కపూర్ రాముడిగా.. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రూ.4000 కోట్ల బడ్జెట్తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుంది. ఇక రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయనున్నారు. ఇప్పుడు చెప్పండి ఆ ‘రామాయణ’ వచ్చి ఉంటే ఎలా ఉండేది?