జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం ఇటీవల ఘనంగా జరిగింది. ఉత్తమ నటిగా బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఆ వేడుకలో పురస్కారం అందుకున్నారు. 2023లో విడుదలైన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాకు గాను రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఆ వేడుకలో ఆమె మరో కారణంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే అదిరా పేరుతో ఉన్న గొలుసును ఆమె ధరించడం. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అదిరా ఎవరు అనేది తెలిసినవాళ్లు ‘కూతురు పేరుతో ఉన్న గొలుసు వేసుకుంది’ అని చెప్పారు. తెలియనివాళ్లు అయితే ఆ పేరు ఎవరిది అని ఆరా తీయడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ విషయమై రాణీ ముఖర్జీ స్పందించింది. తాను ఎందుకు గొలుసు వేసుకొచ్చాను అనే విషయం చెప్పుకొచ్చారు. నేను అవార్డు తీసుకునేటప్పుడు చూడాలని అదిరా ఆశ పడింది. కానీ వేడుకకు 14 సంవత్సరాలలోపు పిల్లలకు అనుమతి లేదు. దీంతో ఆమె రాలేకపోయింది.
నాకెంతో ప్రత్యేకమైన రోజు నా పక్కన ఉండలేకపోయింది. అందుకే తన పేరు మీద గొలుసు చేయించుకున్నాను. అదిరా నా అదృష్టం. అందుకే అలా చేశాను అని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై ఇన్స్టాగ్రామ్ చాలామంది రీల్స్ చేశారు. ‘రాణి తన కుమార్తెను వెంట తీసుకువెళ్లారు’ అంటూ గొలుసును హైలైట్ చేస్తూ వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిని మా అమ్మాయికి చూపించా. ఆమె ఆనందపడింది. ఆ రీల్స్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అని రాణి చెప్పింది.
ఈ కార్యక్రమానికి సబ్యసాచి డిజైన్ చేసిన హెరిటేజ్ చీరలో హాజరయ్యారు. మెడలో తన కుమార్తె పేరుతో ఉన్న గొలుసును వేసుకున్నారు. అదే వేదికమీద షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీల స్నేహం ఆకట్టుకుంది. వేదిక దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవగా రాణీ ముఖర్జీ తట్టుకొని ఇబ్బంది పడకుండా ఉండటానికి చీర పల్లును షారుఖ్ తన చేతితో జాగ్రత్తగా పట్టుకున్నారు.