తెలంగాణలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం అయిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించి, నిర్మాతగానూ తనవంతు ప్రయత్నం చేసిన మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఇవాళ (ఆదివారం, జూన్ 08) ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని AIG హాస్పిటల్లో చికిత్స పొందుతూ, వెంటిలేటర్ మీద ఉన్న ఆయన మరణాన్ని డాక్టర్లు ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. టీడీపీ కార్యకర్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టి, అనంతరం ప్రెసిడెంట్ గా, HUDA డైరెక్టర్ గా, ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా 2014 నుంచి ఇప్పటివరకు సేవలందించిన గోపీనాథ్ కొన్నాళ్లు నిర్మాతగానూ వ్యవహరించారు.
శ్రీకాంత్ (Srikanth) హీరోగా “బస్తీ” (1995), రాజశేఖర్ (Rajasekhar) హీరోగా “రవన్న” (2000), తారకరత్న (Taraka Ratna) హీరోగా “భద్రాది రాముడు” (2004) మరియు రాజశేఖర్ హీరోగా “నా స్టైలే వేరు” (2009) సినిమాలను నిర్మించారు గోపీనాథ్. ఏ ఒక్క సినిమా హిట్ అవ్వకపోవడంతో ఆ తర్వాత నుంచి చిత్రసీమకు దగ్గరగానే ఉన్నా.. నిర్మాణానికి మాత్రం దూరంగా ఉండిపోయారు.
ఇప్పుడు ఆయన మరణంతో.. ఇండస్ట్రీ కంటే రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే సందర్భం ఏర్పడింది. బీఆరఎస్ పార్టీకి ఇది పెద్ద దెబ్బ. గత కొన్నేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆరెస్ పార్టీకి కంచుకోట లాంటిది, ఇప్పుడు బై ఎలక్షన్ కు తెరలేపడంతో.. బీఆర్ఎస్ పార్టీ మరో సీటు కోల్పోయి, తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.