కమల్, వెంకీలు హీరోలుగా.. ‘కూచిపూడి వారి వీధి’…???

  • January 19, 2019 / 10:52 AM IST

‘కొత్త బంగారు లోకం’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలతో విశేషంగా ఆకట్టుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. అంతేకాదు రెగ్యులర్ ఫార్మేట్ లో కాకుండా తనదైన శైలి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతాను చాటుకున్నాడు. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలు ఇక రావు అనుకున్న తరుణంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో ఆ అడ్డుకట్టను తెంచేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ‘ముకుంద’ చిత్రంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను లాంచింగ్ విషయంలో తడబడ్డాడు. అంతేకాదు తన పై ఉన్న నమ్మకంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ‘పీవీపి’ లాంటి పెద్ద నిర్మాణ సంస్థతో మహేష్ సహా నిర్మాతగా ఉంటూ అందండలు అందించినప్పటికీ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని సరిగ్గా తీర్చి దిద్దలేకపోయాడు. ఈ చిత్రంతో మహేష్ కోలుకోవడానికి రెండేళ్ళు పట్టింది. అయితే శ్రీకాంత్ అడ్డాల పైన నమ్మకం మాత్రం కొందరి నిర్మాతలలో అలాగే ఉంది అనడంలో సందేహం లేదు.

తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా తన సొంతూరు ఇరగవరం మండలంలోని రేలంగి గ్రామానికి విచ్చేసిన శ్రీకాంత్… తన తదుపరి సినిమా సంగతులతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. సొంతూరులో సంక్రాంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని… ఇప్పటివరకు నాలుగు సినిమాలను డైరెక్ట్ చేసినట్లు.. ప్రస్తుతం గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలిపాడు. ఇదిలా ఉండగా కమల్ హాసన్, వెంకటేష్ లతో మల్టీస్టారర్ సినిమా చేసే ఆలోచన ఉందని, దానికి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అలాగే త్వరలోనే నిర్మాణ బాధ్యతల్ని కూడా చేపట్టే ఆలోచన ఉన్నట్టు స్పష్టం చేశాడు. కమల్ -వెంకటేష్ లతో మల్టీ స్టారర్ తీయబోతున్నట్టు శ్రీకాంత్ తెలుపడంతో.. ఇప్పుడు ఈ విషయం పై అటు ఫిలింనగర్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus