Karuppu: సూర్య ఫ్యాన్స్కి సారీ చెప్పిన ప్రొడక్షన్ హౌస్.. ఎట్టకేలకు..
- May 15, 2026 / 02:20 PM ISTByFilmy Focus Desk
అంతా బాగానే ఉంది.. సినిమా ప్రచారంలో తీసుకొచ్చిన వైబ్ కూడా బాగుంది.. సినిమా వచ్చక థియేటర్లలో రచ్చ రచ్చ చేసేద్దాం అని అనుకున్నారు ఆ హీరో ఫ్యాన్సంతా. సినిమా టీమ్ కూడా ఇదే అనుకుంది. తమిళనాడులో ప్రత్యేక షోలకు పర్మిషన్ కూడా వచ్చింది. అయితే సినిమా అనుకున్న రోజుకు విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితి టాలీవుడ్లో కూడా చూసుంటాం. అయితే రీసెంట్గా ఈ పరిస్థితిని కోలీవుడ్ చూసింది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘కరుప్పు’ ఈ సిట్యువేషన్ని ఫేస్ చేసింది.
Karuppu
సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో ఆర్జే బాలాజీ తెరకెక్కించిన సినిమా ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’గా రిలీజ్ చేస్తున్నారు. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల షోలు రద్దు కావడంతో అటు దర్శకుడు, ఇటు సినిమా టీమ్, మరో వైపు సూర్య అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఓ పోస్ట్ పెట్టింది.

కొన్ని సినిమాలు పరీక్షిస్తాయన్న సినిమా టీమ్.. సమయాన్ని మాత్రమే కాకుండా, హృదయాన్ని కూడా పరీక్షించే ప్రయాణాలు కొన్ని ఉంటాయి అని రాసుకొచ్చింది. ‘కరుప్పు’ సినిమా కోసం ఎదురుచూసి, నిరంతరం దాని గురించి ఆరా తీస్తూ, మా ఆలస్యాన్ని భరిస్తూ మాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు అని ఆ నోట్లో రాసుకొచ్చారు. ఈ ఎదురుచూపు ఎంత బాధాకరమైనదో మాకు తెలుసు. మీరు ప్రేమతో, అంచనాలతో ఈ సినిమా కోసం వేచి ఉన్నారని తెలుసు అని కూడా రాసుకొచ్చారు.
సినిమా ఆలస్యానికి మేమూ బాధపడ్డాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీ మద్దతు, మీరు పెట్టిన మెసేజ్లు, మీ ప్రేమే ఈ రోజు మా కలను నిజం చేస్తూ మీ ముందుకు ఈ సినిమా వచ్చింది అని ఎమోషనల్గా రాసుకొచ్చారు. సినిమా ఆలస్యానికి కారణం ఏంటా అని చూస్తే.. ఈ నిర్మాణ సంస్థ గత సినిమాలకు సంబంధించిన విషయమని తేలింది. ఆ సినిమాల ఫైనాన్సియర్లకు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమా విడుదల విషయంలో అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు వాటిని తేల్చేశారు అని టాక్.













