‘జాక్’ సినిమా విడుదలకు ముందు సిద్ధు జొన్నలగడ్డ చాలా యాక్టివ్గా కనిపించాడు. ఆ సినిమా మీద చాలా నమ్మకాలే పెట్టుకున్నాడు. దాంతో తనకు అప్పటివరకు అలంకారంగా ఉన్న యాటిట్యూడ్ని బలంగానే చూపించాడు. అయితే ఆ సినిమా తేడా ఫలితం కొట్టిన తర్వాత ఒక్కసారిగా డల్ అయ్యాడు. అప్పు చేసి మరీ ‘జాక్’ నష్టాలు తీర్చడంలో సాయపడ్డాడు. అయితే ఆ సమయంలో ఆయన మీద వచ్చిన ఓ విమర్శను మాత్రం సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేడు. అదే ‘సీక్వెల్ స్టార్’. అంటే ఒకే రకం సినిమాతోనే విజయం అందుకుంటున్నాడు అని.
‘డీజే టిట్లు’ సినిమా వచ్చిన తర్వాత ‘టిల్లు స్క్వేర్’తో వచ్చాడు సిద్ధు. ఆ రెండు సినిమాలూ భారీ విజయాలు అందుకున్నారు. ఆ జోష్లో ఉండగా ‘జాక్’ సినిమా వచ్చి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో ఒకే లాంటి పాత్రనే సిద్ధు నమ్ముకున్నాడు, దానినే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనే ఆలోచనలు బయటకు వచ్చాయి. దీంతో ఇప్పటికిప్పుడు ఆ మరక చెరిపేసుకోవాలని అభిమానులు అవకాశం ఉన్న అన్ని దారుల్లో సిద్ధుకు తెలిసేలా చేశారు. కానీ ఇప్పుడు మరోసారి సీక్వెల్ మాట వాడుతున్నాడు సిద్ధు.
నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబరు 17న రానుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వృత్తిగత జీవితం గురించి చాలా విషయాలు చెప్పారు. అలాగే ‘తెలుసు కదా’ సినిమా సీక్వెల్ కూడా ఉండొచ్చు అని చెప్పారు. దీంతో సీక్వెల్ స్టార్ టాపిక్ చర్చలోకి వచ్చింది.
‘డీజే టిల్లు’ సినిమాకి కొనసాగింపు సినిమా చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ప్రేక్షకులు కోరుకోవడంతోనే ‘టిల్లు స్క్వేర్’ సినిమా వచ్చింది. ‘తెలుసు కదా’ సినిమా కథకైతే ముగింపు ఉంది. అందులోని వరుణ్ పాత్ర కూడా టిల్లులా డిమాండ్ చేస్తే కొనసాగింపు సినిమా రావొచ్చు అని అన్నాడు సిద్ధు. అంటే ఆలోచనలు అయితే ఉన్నాయి. వరుణ్ పాత్ర క్లిక్ అయితే మళ్లీ మళ్లీ వస్తాడు. ఇదంతా ఓకే కానీ ‘టిల్లు 3’ ఎప్పుడో మరి.