అచ్చమైన తెలుగు కథకు నిలువెత్తు రూపం త్రివిక్రమ్!

  • November 5, 2016 / 01:19 PM IST

సినిమాల్లో ప్రధానంగా రెండు రకాలు. ఒకటి విలువలు పాటించేవి.. మరొకటి డబ్బులు కురిపించేవి. మొదటి దాటికి ఆర్ట్ ఫిలిమ్స్ అని ముద్ర వేస్తే, రెండోదానికి కమర్షియల్ మూవీలంటూ పేరు పెట్టారు. ఈ రెండింటిని మిక్స్ చేసి సినిమాలు తీసి విజయవంతమయిన అతితక్కువమందిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టి మాటలతో మాయ చేసి మాటల మాంత్రికుడిగా బిరుదు అందుకున్నారు. డైరక్టర్ గా కుటుంబ సమేతంగా చూసే చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ లో టాప్ డైరక్టర్ గా నిలబడ్డారు. తెలుగుదనం నిండిన చిత్రాలు తీసే ఈ మాంత్రికుడు నేడు (నవంబర్ 7) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ స్పెషల్ ఆర్టికల్..

1. నువ్వే నువ్వే“జీవితంలో ధనం కన్నా విలువైనది ఎన్నో ఉన్నాయి” అనే థీమ్ తో త్రివిక్రమ్ రాసిన కథ నువ్వే నువ్వే. తొలి సారి దర్శకత్వం వహిస్తున్నాననే టెన్షన్ లేకుండా చక్కగా తీశారు. పొడి మాటలతో పంచ్ లు వేసే మాటల మాంత్రికుడు ఇందులో బరువైన మాటలు రాసి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు.

2. అతడు“ప్రేమ, అభిమానం అనేవి హంతకుడిని సైతం మామూలు మనిషిని చేస్తాయి” అనే ఐడియాతో రూపొందిన చిత్రం అతడు. ఈ మూవీ ద్వారా ఉమ్మడి కుటుంబం లోని అనుబంధాలను నేటి యువతకు చాలా తాజాగా చూపించారు.

3. జల్సాయుద్ధంలో గెలవడం అంటే ఓడించడం.. చంపడం కాదు అనే సిద్ధాంతాన్ని.. చక్కని ప్రేమకథతో జోడించి త్రివిక్రమ్ తీసిన చిత్రం జల్సా. ఇందులో అన్యాయాన్ని ఆపడానికి రక్తపాతమే అవసరం లేదని చూపించారు.

4. ఖలేజామంచి మనసున్న ప్రతి ఒక్కడూ దేవుడే… అనే మంచి వాఖ్యాన్ని ఆధారం చేసుకుని మాటల మాంత్రికుడు డెవలప్ చేసిన స్టోరీ ఖలేజా. ఒక మంచి కార్యం చేయడానికి పంచభూతాలు మనకి సహకరిస్తాయని మన పెద్దవాళ్లు చెప్పిన సంగతి ఈ మూవీ చూస్తున్నప్పుడు అందరికీ గుర్తుకువస్తుంది.

5. జులాయిదురాశ దుఃఖానికి చేటు అనే తెలుగు సామెతను థీమ్ గా చేసుకొని కథను అల్లుకున్న సినిమా జులాయి. చిన్నప్పుడు తెలుగు పుస్తకాల్లోని సామెతలను అర్ధం చేసుకుంటే అందులోంచి ఎన్నో కథలు తయారు చేయవచ్చని ఈ ఫిల్మ్ ద్వారా త్రివిక్రమ్ నిరూపించారు.

6. అత్తారింటికి దారేదిమనిషి బతకడానికి డబ్బు అవసరమవుతుందేమో గాని.. సంతోషంగా జీవించడానికి డబ్బు మాత్రమే సరిపోదు. ప్రేమను పంచడానికి, పుచ్చుకోవడానికి మనకంటూ కొంతమంది ఆత్మీయులు కావాలి. అత్తారింటికి దారేది సినిమాల్లో దాగున్న రహస్యమిదే. ఈ చూసిన తర్వాత అందరి మనసులో మదిలో మెదిలో మాట “కలిసి ఉంటే కలదు సుఖం”.

7. సన్నాఫ్ సత్యమూర్తిమనిషి చచ్చిపోయినా మాట చావదు అంటుంటారు.. తండ్రి ఇచ్చిన మాటను కొడుకులు కట్టుబడి ఉండడం తెలుగు వారికి అలవాటు. ఆస్తుల కోసం తండ్రి కొడుకులు కొట్టుకునే ఈ కాలంలో నాన్న విలువలనే ఆస్తిగా భావించేవారు కూడా ఉంటారు. అదే టాపిక్ తో తెరకెక్కిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి.

8. అ..ఆగ్రామాల్లో ఇప్పటికీ పరువు, ప్రతిష్ట కోసం ప్రాణాలు ఇచ్చే వారున్నారు. అటువంటి కుటుంబాలలో జరిగే సంఘటనల కలయికే అ..ఆ మూవీ కథ. యద్దనపూడి సులోచన రాణి దశబ్దాల క్రితం రాసిన మీనా కథ ఆధారంగా తెరకెక్కిన ఇందులోనూ కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

కమర్షియల్ కథ అనగానే నాలుగు ఐదు విదేశీ చిత్రాలను చూసి, దానికి కొన్ని యాక్షన్ సీన్లు, ఐటెం సాంగులు జతచేసే కొంత మంది డైరెక్టర్లకు భిన్నంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మన ఇళ్లల్లో జరిగే సంఘటనలకు కమర్షియల్ స్టేటస్ తీసుకొచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus