‘మనీ’ (Money) ఓ ట్రెండ్ సెట్టర్. ఈ మాట చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు.క్రైమ్ కామెడీ జోనర్ ను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఈ సినిమానే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు. ‘రూత్లెస్ పీపుల్’ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా ‘మనీ’ని రూపొందించాడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) శిష్యుడు శివ నాగేశ్వరరావు.1993 వ సంవత్సరం జూన్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. నేటితో ఈ సినిమా విడుదలై 32 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఇప్పటికీ ఈ సినిమాని జనాలు మర్చిపోలేరు. ఎందుకంటే ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ఈ సినిమా. ఈ మధ్య జనాలు ఎక్కువగా చెప్పుకునే ‘డార్క్ కామెడీ’ ఫ్లేవర్ ఇందులో ఎక్కువగానే ఉంటుంది. సినిమా సీరియస్ గానే సాగుతుంది.. పాత్రలు కూడా సీరియస్ గానే సాగుతాయి. కానీ కామెడీ జెనరేట్ అవుతుంది.. జనాలు నవ్వుతారు. అది ఈ సినిమా స్పెషాలిటీ. బ్రహ్మానందం,జెడి చక్రవర్తి, చిన్న వంటి వారు ఈ సినిమా తర్వాతే బాగా బిజీ అయ్యారు.
ముఖ్యంగా బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ గురించి చెప్పాలి అంటే అప్పటి వరకు ఒక లెక్క.. దీని తర్వాత మరో లెక్క అని చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ బాడీ మూమెంట్స్ తో ఉండేది. కానీ ‘మని’ (Money) లో సెటిల్డ్ గా ఉంటూనే కామెడీ పండించారు. అలాగే ఈ సినిమాలో జయసుధ -పరేష్ రావల్ పాత్రలు గురించి చెప్పుకోవాలి. వాళ్ళ పాత్రలు కూడా చాలా కీలకం. పరేష్ రావల్ కూడా సీరియస్ గానే కామెడీ పండించారు.
ఈ పాత్ర గురించి ఓ సీక్రెట్ కూడా ఉంది. అదేంటంటే.. ముందుగా పరేష్ రావల్ పాత్ర కోసం దివంగత స్టార్ సింగర్ ఎస్పీ బాలుని సంప్రదించారట. ఎస్పీబి ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు కాదు.. శివ నాగేశ్వరరావు (Shiva Nageswara Rao) డైరెక్ట్ చేస్తున్నారు అని తెలిసి.. ‘నేను చేయను’ అని చెప్పి బాల సుబ్రహ్మణ్యం (Balasubrahmanyam) తప్పుకున్నారట. ఆ తర్వాత ఇదే పాత్ర కోసం దర్శకరత్న దాసరిని కూడా సంప్రదించారట. ఆ టైంకి ఆయన బిజీగా ఉండటంతో చేయలేకపోయారు. దీంతో బాలీవుడ్ నుండి పరేష్ ను దింపాడు వర్మ. అతనికి ఈ సినిమా వల్ల.. తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి.