డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం.. లోకేశ్ కనగరాజ్ అబద్ధం చెప్పారా? అసలు విషయాన్ని హైప్ కోసం దాచేశారా? ఏమో నిన్నటివరకు కోడంబాక్కం వర్గాలు, ఇప్పుడు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్న మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. గతంలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ చెప్పిన విషయాలు, జరిగిన విషయాలు చూశాక ఈ డౌట్ కచ్చితంగా వస్తుంది. అదే జరిగితే పైన చెప్పినట్లుగా లోకేశ్ కనగరాజ్ అబద్ధం చెప్పినట్లే. అంతేకాదు అదే జరిగితే లోకేశ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ కూడా అవుతారు. ఎందుకంటే ఇన్నాళ్లూ లోకేశ్ కాదని చెప్పిన ఎల్సీయూ ఇప్పుడు అవును అవ్వొచ్చు కాబట్టి.
రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్.. ఇలా అగ్ర తారాగణం కలయికలో స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’. ఈ నెల 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు ఉన్న హైప్ అదే రోజు విడుదల అవుతున్న మరో సినిమాకు లేదంటే అతిశయోక్తి కాదు. కారణాలు ఏమైనా కావొచ్చు ‘కూలీ’ గురించి అయితే తెగ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ చర్చను మరింత పెంచేలా సినిమా రైటింగ్ టీమ్లో పని చేసిన చంద్రు అన్బళగన్ మాటలు ఉన్నాయి.
ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో కచ్చితంగా ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారు. అదేంటో చెప్పలేదు కానీ సినిమా అయితే ఫ్యాన్స్కి చాలా ఆనందాన్నిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే అది ఓ నటుడి ఎంట్రీ కాని, లేదంటే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో సినిమాను భాగం చేయడం కానీ అవుతుంది అనేది బయట జరుగుతున్న చర్చ. కొంతమంది ఇది ఎల్సీయూలో భాగం చేయడమే మరికొందరు.. ‘విక్రమ్’ అలియాస్ కమల్, ‘రోలెక్స్’ అలియాస్ సూర్య, ‘లియో’ అలియాస్ విజయ్ రావొచ్చు అని అంటున్నారు. మరికొందరు ‘ఖైదీ ఢిల్లీ’ అలియాస్ కార్తి కూడా కావొచ్చంటున్నారు. అసలు కథేంటో తేలాలంటే రేపటి మొదటి షో వరకు వెయిట్ చేయాల్సిందే.