చాలా నెలల ప్రయత్నాల తర్వాత బాలీవుడ్లో నిర్మాతగా సోలో సినిమా చేస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తన ఆస్థాన దర్శకుడు వంశీ పైడిపల్లితో బాలీవుడ్లో కథలు చెప్పించిన దిల్ రాజు.. ఫైనల్గా సల్మాన్ ఖాన్తో సినిమాకు ఓకే అనిపించుకున్నారు. ఇటీవల సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు కూడా. ఇప్పుడు షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ టాపిక్ పెద్ద ఎత్తున చర్చలా జరుగుతోంది. అదే ఈ సినిమాలో విలన్ ఎవరు అని.
ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. కాస్టింగ్ విషయంలో కూడా దానికి తగ్గట్టుగానే సిద్ధం చేసుకుంటున్నారు. దానికి ఓ ఉదాహరణ హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసుకోవడమే. ‘జవాన్’ సినిమా తర్వాత మళ్లీ నయన్ తిరిగి బాలీవుడ్కి వెళ్లదు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆమెను సినిమాకు తీసుకున్నారు. ఈ క్రమంలో భారీ పారితోషికమే ముట్టజెబుతున్నారు అని టాక్. ఇప్పుడు విలన్ పాత్ర కోసం కూడా ఇలానే ఆలోచిస్తున్నారు అని సమాచారం.
హీరో నార్త్ కాబట్టి హీరోయిన్ని సౌత్ భామను తీసుకున్నారు అని అంటున్న సమయంలో విలన్గా ఎవరు అనే చర్చ. ఈ క్రమంలో ఓ నార్త్ స్టార్ యాక్టర్, ఒక సౌత్ స్టార్ యాక్టర్ను కాంటాక్ట్ అయ్యారని టాక్. బాలీవుడ్లో చాలా ఏళ్లుగా ఉన్నా ఇటీవల ‘ధురంధర్’ సినిమాలతో తానేంటో, తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్న అక్షయ్ ఖన్నాను సల్మాన్కి విలన్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. మరోవైపు ‘పుష్ప’ సినిమాలతో పాన్ ఇండియా విలన్ అయిపోయిన ఫహాద్ ఫాజిల్ పేరు కూడా చర్చలో ఉంది.
ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా వారు ఇంటెలిజెంట్ విలన్గా కనిపిస్తారు అనే చర్చ నడుస్తోంది. అంటే బుర్ర వాడి విలనిజం చేస్తారని టాక్. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఫిజిక్కి ఈ ఇద్దరు నటులు సరితూగరు. పక్కన నిల్చుంటే ఆ విలనీ ఫీలింగ్ ప్రేక్షకులకు రాదు అని చెప్పొచ్చు. చూడాలి మరి దర్శకుడు వంశీ పైడిపల్లి ఆలోచనలు ఎలా ఉన్నాయో.