తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకులు

  • February 27, 2018 / 12:44 PM IST

సినిమాకి కెప్టెన్ దర్శకుడు. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ చిత్రాన్ని తెరకెక్కించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఆ సవాళ్ళను స్వీకరించడానికి మహిళలు వెనుకడుగు వేయడం లేదు. మెగా ఫోన్ అందుకొని మంచి చిత్రాలను రూపొందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులపై ఫోకస్..

భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి అలనాటి మేటి నటి భానుమతి. మహిళలు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి భయపడే సమయంలోనే డైరక్టర్ కుర్చీలో కూర్చొని చండీరాణి అనే సినిమాని తెరకెక్కించారు.

సావిత్రి మహానటి సావిత్రి నటిగానే కాకుండా దర్శకురాలిగా మంచి పేరు దక్కించుకున్నారు. చిన్నారి పాపలు, చిరంజీవి, మాతృ దేవత, వింత సంసారం అనే సినిమాలను చక్కగా తెరకెక్కించి అభినందనలు అందుకున్నారు.

విజయ నిర్మల సూపర్‌స్టార్ హీరో కృష్ణ సతీమణి విజయనిర్మల నటిగా కొనసాగుతూనే దర్శకురాలిగా మారి ‘ప్రజల మనిషి, హేమా హేమీలు, బెజవాడ బెబ్బులి’ వంటి పలు హిట్ చిత్రాలు తీసి భారతదేశంలోనే అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకురాలిగా గిన్నిసుబుక్‌లో ఎక్కారు.

జయ జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన బి. జయ సూపర్ హిట్ అనే సినీవారపత్రికను స్థాపించి సినిమా రంగంపై అవగాహన పెంచుకొని డైరక్టెర్ గా మారారు. ప్రేమలో పావని కళ్యాణ్‌ సినిమాతో దర్శకురాలిగా పరిచయమై చంటిగాడు తో హిట్ కొట్టారు. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి చిత్రాలు రూపొందించారు.

జీవిత నటిగా మహిళల మనసు గెలుచుకున్న జీవిత శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ప్రేమ కథను అద్భుతంగా ఆవిష్కరించి అందరితో ప్రశంసలు అందుకున్నారు.

నందిని రెడ్డిఆలా మొదలయింది అంటూ నందిని రెడ్డి డైరక్టర్ గా కెరీర్ ని ప్రారంభించారు. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ లేడీ డైరక్టర్ తాజాగా త్రివిక్రమ్ నిర్మాణంలో సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.

సుచిత్ర చంద్ర బోస్ రచయిత చంద్రబోస్ సతీమణి సుచిత్ర కి డైరక్షన్ అంటే ఇష్టం. అందుకే కె రాఘవేంద్ర రావు వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకొని పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాని తీసి శెభాష్ అనిపించుకున్నారు.

చునియామా టీవీలో ప్రసారమైన యువ సీరియల్ ద్వారా చునియా డైరక్టర్ గా పరిచయమైంది. తర్వాత ‘పడేశావే’ అనే సినిమాతో వెండితెర దర్శకురాలిగా మారారు. ఈ సినిమాకు ఆశించినంత విజయం సాధించనప్పటికీ డైరెక్టర్‌గా చునియా మంచి మార్కులు కొట్టేసింది.

శశికిరణ్‌సినీ రచయిత, హాస్యనటుడు ఎంఎస్‌ నారాయణ కుమార్తె శశికిరణ్‌ కూడా మెగాఫోన్‌ పట్టింది. సాహెబా సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. ఆర్ధికంగా ఈ సినిమా విజయం సాధించకున్నా ఆమె దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కాయి.

మంజుల
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, హీరో మహేశ్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల కూడా “మనసుకు నచ్చిన”పని చేశారు. దర్శకురాలిగా మారి “మనసుకు నచ్చింది” అనే సినిమాని తీశారు.

సంజనారెడ్డిఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్‌గా పనిచేసిన సంజనారెడ్డి సినిమాపై ఉన్న అభిమానంతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర ‘రౌడీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. రాజ్ తరుణ్, అమైరా దస్తర్ జంటగా నటిస్తున్న “రాజుగాడు” సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus