సినిమాకు సీక్వెల్.. ఇప్పుడిది పెద్ద విషయం కాదు. ఓ మోస్తారుగా ఆడిన సినిమాకు కూడా సీక్వెల్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అయితే అది ఇప్పటి సినిమాలకు. కానీ కల్ట్ అనే గుర్తింపు, ఘనత పొందిన సినిమాలకు సీక్వెల్ అంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటి సినిమా విజయానికి, ఇప్పటి సినిమా ఫలితానికి లింక్ పెట్టేసి లేనిపోని లెక్కలు కడతారు. ఇప్పుడు వచ్చే కొత్త సినిమా విజయం ఎంత బాగున్నా, సినిమా ఎంత బాగా వచ్చినా పోలిక ఇబ్బందిపెడుతుంది.
ఇదంతా మన సినిమా జనాలకు తెలియనిది కాదు. అయినప్పటికీ సీక్వెల్స్కి రెడీ అవుతారు. దీనికి కారణం తొలి పార్టు విజయం, రెండో పార్టుకి అతి పెద్ద ప్రచారం కాబట్టి. మరి ఈ ఆలోచన ఉందో, లేక అప్పటిలా మరోసారి మెరిపించాలని అనుకుంటున్నారో కానీ.. ఆమిర్ ఖాన్ తన కల్ట్ సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకుంటున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ‘3 ఇడియట్స్’ సినిమాకు కొనసాగింపు సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆమిర్ ఖాన్ తెలిపారు.
ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘3 ఇడియట్స్’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర భారీ విజయం సాధించింది. వసూళ్ల పరంగానే కాకుండా వినోదం పరంగా, విషయాలోచన పరంగా ఈ సినిమా అదరగొట్టింది. విద్యా వ్యవస్థ విషయంలో ఈ సినిమా తీసుకొచ్చిన చర్చ చాలా పెద్దది. ఇప్పుడు మరోసారి ఆ మార్కు సినిమా చేయాలని ఆమిర్ – రాజ్ కుమార్ హిరానీ అనుకుంటున్నారట.
తొలుత వీళ్లిద్దరూ కలసి దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ చేయాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో ఇబ్బందులు ఎదురై ఆ ప్రయత్నం విరమించుకున్నారు. దీంతో ‘3 ఇడియట్స్’ సీక్వెల్ ఆలోచన వచ్చిందట. ఇప్పుడు ఏ అంశాల మీద చర్చ జరిగేలా సినిమాను తీర్చిదిద్దుతారు అనేది చూడాలి. తొలి సినిమాలోని పాత్రలు ఈ సినిమాలోనూ కొనసాగుతాయని ప్రాథమిక సమాచారం.