మోహన్ బాబు (Mohan Babu) ని ఒకానొక టైంలో ప్లాపులు వెంటాడాయి. సొంత బ్యానర్లో తీసిన సినిమాలు నిరాశపరిచాయి. ఇక నిర్మాణ సంస్థ ఆపేస్తారనే ప్రచారం కూడా నడిచింది. అలాంటి టైంలో స్నేహితుడు రజినీకాంత్ (Rajinikanth) సలహా మేరకు తమిళ సినిమా ‘నట్టమై’ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఆ టైంలో మోహన్ బాబు ఉన్నదంతా పెట్టి.. ఆ సినిమాని నిర్మించడం జరిగింది.
రజినీకాంత్ (Rajinikanth) కూడా ఓ గెస్ట్ రోల్ చేశారు. అక్కడితో అయిపోలేదు. అదే టైంలో ఓ పెద్ద హీరో సినిమాకి పోటీగా ‘పెదరాయుడు’ని దింపారు. ఇది చిన్న రిస్క్ కాదు. తేడా వస్తే ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. అలాంటి రిస్క్ చేశారు మోహన్ బాబు…! అయితే దేవుడి దయ… ‘పెదరాయుడు’ కంటెంట్ ప్రేక్షకులను అలరించడంతో సినిమా పెద్ద హిట్ అయ్యింది. కాదు కాదు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మారుమూల గ్రామాల్లో కూడా ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంచుకునే సినిమాగా కూడా ‘పెదరాయుడు’ నిలిచింది.
సరిగ్గా 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu)కూడా ఇలాంటి సాహసమే చేశాడు. అదే ‘కన్నప్ప’ (Kannappa). ఈ సినిమా కోసం దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ పెట్టాడు. ఆల్మోస్ట్ తనకు ఉన్నదంతా పెట్టేశాడు అనే చెప్పాలి. సినిమాలో స్టార్స్ ఉన్నా కంటెంట్ బాగోకపోతే… జనాలు థియేటర్ కి రాని రోజులివి. మరోపక్క సోషల్ మీడియాలో ఓ మాదిరిగా ఉన్న సినిమాని కొంతమంది బ్రతకనివ్వకుండా చంపేస్తున్న రోజులు కూడా..! ఇలాంటి టైంలో మంచు విష్ణు (Manchu Vishnu) చేసింది చిన్నపాటి రిస్క్ కాదు. అయినప్పటికీ ‘కన్నప్ప’ (Kannappa) తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతూ థియేటర్ నుండి బయటకు వచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ అయ్యింది. మేకర్స్ కి ఇంతకంటే కావాల్సింది ఏముంది. కలెక్షన్స్ రూపంలో ఎన్ని వందల కోట్లు వచ్చినా.. జనాలు కంటెంట్ కి కనెక్ట్ అయ్యి ఇచ్చే ప్రశంసలు చాలా విలువైనవి. అవి ‘కన్నప్ప’ (Kannappa) సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.