ఒకప్ప్పుడు కామెడీనే కామెడీ అబ్బా.. ఇప్పుడు కామెడీ ఏముంది? అని ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు. పాత సినిమాల వీడియోలు షేర్ చేస్తూ ఆ రోజులు తిరిగి రావు అని మురిసిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ ప్రశ్నకు ఆన్సర్ మాత్రం చెప్పలేరు. అదే అప్పటి కామెడీని ఇప్పుడు చేస్తే ఊరుకుంటారా? కచ్చితంగా ఒప్పుకోరు అనే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు కథానాయకుడు అల్లరి నరేశ్ కూడా ఇదే మాట అంటున్నారు. అప్పటి వినోదం ఇప్పుడు చేస్తే ఇప్పుడు మనోభావాలు దెబ్బ తింటాయి అని అంటున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీతో మెప్పించగల అతికొద్ది మంది హీరోల్లో అల్లరి నరేశ్ ఒకరు. గత కొన్ని ఏళ్లుగా ఆ మ్యాజిక్ మిస్ అవుతూ వస్తోంది. కొన్నేళ్లు ఆయన సీరియస్ సినిమాలవైపు వెళ్లడం, ఆ తర్వాత కామెడీ చేసినా కనెక్ట్ కాకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు తిరిగి తన పూర్వపు ఫామ్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేసిన ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి 10 సంవత్సరాలకు సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ మారుతోంది. దానికి తగ్గట్టుగా అందరూ అప్డేట్ కావాలి. ఈ రోజుల్లో కామెడీ చాలా సున్నితమైన అంశం అయిపోయింది. ఏదైనా ఫేమస్ డైలాగ్ని ఇప్పుడు సినిమాల్లో పెడుతుంటే ఫలానా వాళ్లను అన్నారని, మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు అని చెప్పారు. ఈ మాటలో నిజం లేకపోలేదు. ఎందుకంటే రీసెంట్గా దివంగత ఎన్టీఆర్ డైలాగ్ కోసం ‘అమెచ్చూరిష్’గా నానా యాగీ చేశారు ఫ్యాన్స్ అని చెప్పుకొన్న కొంతమంది నెటిజన్లు.
సుమారు 100 సినిమాలకు స్పూఫ్గా తీసిన ‘సుడిగాడు’ సినిమాకు సీక్వెల్ కావాలని చేయాలని చాలా మంది అడుగుతున్నారని.. కానీ ఆ సినిమా గురించి ఆలోచిస్తే తనకు టెన్షన్ వస్తోందని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు మళ్లీ స్పూఫ్లతో ‘సుడిగాడు 2’ సినిమా తీస్తే.. ఆ వార్స్ ఎక్కువైపోతాయి. అలాగే ఒకప్పుడు ‘కితకితలు’ సినిమా చేశాం. అదే ఇప్పుడు చేస్తే ‘మహిళను బాడీ షేమింగ్ చేస్తారా’ అంటూ విమర్శిస్తారు అని గ్రౌండ్ రియాలిటీ చెప్పారు నరేశ్.
అలాగే ఒకప్పుడు ఒక కమెడియన్ను మరో కమెడియన్ కొడితే నవ్వేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ‘అమానవీయం.. అమానుషం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు అని ఇకపై అలాంటి సినిమాలు రావడం కష్టమే చెప్పకనే చెప్పారు.