టాలీవుడ్లో లేడీ డైరక్టర్స్ తక్కువగా వస్తుంటారు. అప్పుడప్పుడు వచ్చినా.. ఎక్కువ రోజులు కెరీర్ కొనసాగించలేకపోతున్నారు. దీంతో లేడీ డైరక్టర్స్ అంటే ఇండస్ట్రీలో చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. వరుస సినిమాలు చేసి, విజయాలు అందుకుని స్టార్ డైరక్టర్లు అవ్వాలని ఆశిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్లో మరో లేడీ డైరక్టర్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘మేమ్ ఫేమస్’ సినిమా హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా సినిమా తీయబోతున్నారట. ఇక్కడ విశేషం ఏంటంటే ఆమె ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యురాలు.
సుకుమార్ దగ్గర సుమారు 15 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. వారిలో మాధురి అని మహిళ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమెనే సుమంత్ ప్రభాస్తో సినిమా తీస్తారట. సుకుమార్ ఇటీవల ఆ కథ విని తనదైన మార్పులు, చేర్పులు చెప్పి ఓకే చేశారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా అనౌన్స్ చేస్తారట. ఆ సినిమాకు సుకుమార్ ఓ నిర్మాతగా ఉంటారట. మరో పెద్ద నిర్మాణ సంస్థ మెయిన్ ప్రొడ్యూసర్గా ఉంటారని సమాచారం.
నిజానికి సుకుమార్ క్యాంప్ నుండి ఇప్పటికే ఓ మహిళా దర్శకురాలు బయటకు రావాల్సింది. రెండేళ్ల క్రితం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా భోగవల్లి ప్రసాద్ – సుకుమార్ కలిపి ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమాను వైష్ణవి అనే లేడీ డైరక్టర్ హ్యాండిల్ చేస్తారని ప్రకటించారు. కానీ ఆ సినిమా ముందుకెళ్లలేదు. ఆ స్థానంలోనే ‘జాక్’ సినిమాను తెరకెక్కించారని సమాచారం. మరిప్పుడు ఈ కొత్త మహిళా దర్శకురాలు సినిమా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇక సుకుమార్ శిష్య బృందం నుండి మరో సహాయ దర్శకుడు దర్శకుడిగా మారబోతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలకు కీలకంగా పని చేసిన వీరా కొగటం దర్శకుడు అవుతున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్కి తీసుకొస్తారట. వంశీ నందిపాటి ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం.