ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మార్క్ రైడెల్ (97) కన్నుమూశారు. లాస్ ఏంజిలెస్లోని వుడ్ల్యాండ్ హిల్స్లో వినోద పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన ఓ విశ్రాంతి గృహంలో ఆయన మరణించారు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో తన తండ్రి మరణించినట్లు రైడల్ కుమార్తె అమీ రైడెల్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. దీంతో హాలీవుడ్ సినిమా ప్రముఖులు రైడెల్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
రైడెల్ 1955లో టీవీ రంగంతో కెరీర్ని ప్రారంభించారు. అప్పట్లో బ్యాజ్ పియానిస్ట్గా కూడా చేశారు. ‘ది లాంగ్ గుడ్ బై’, ‘పంచ్ లైన్’ లాంటి సినిమాలతో రాణించారు. తొలినాళ్లలోనే స్టీగర్, మినెయో లాంటి దిగ్గజాలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రైడల్. ‘ది ఫాక్స్’ అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘సిండ్రెల్లా లిబర్టీ’, ‘ది రోజ్’, ‘ఇంటర్సెక్షన్’, ‘ఈవెన్ మనీ’ లాంటి సినిమాలతో రాణించారు.
1981లో వచ్చిన ‘ఆన్ గోల్డెన్ పాండ్’ సినిమా ఆస్కార్లో పది నామినేషన్లు దక్కించుకుంది. ఈ సినిమాకుగాను రైడెల్ ఆస్కార్ నామినేషన్ సాధించినా.. పురస్కారం అయితే దక్కించుకోలేదు. నటుల నుండి అత్యుత్తమ నటనను రాబట్టడంలో రైడల్కి మంచి పేరుంది. ఆయనను హాలీవుడ్లో ‘యాక్టర్స్ విస్ఫరర్’ అని పిలిచేవారు. ఆయన దర్శకత్వంలో నటించిన హెన్రీ ఫోండా, కాథరిన్ హెప్బర్న్ వంటి దిగ్గజ నటులు ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం గమనార్హం.