మ్యూజిక్ ఆల్బమ్స్తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మహేశ్ జీరావాలా (Mahesh Jirawala) కు ఏమైంది? గత కొన్ని రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆయన కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళనే. అహ్మదాబాద్లో ఇటీవల విమాన ప్రమాదం జరిగిన రోజు ఆయన ఆ ప్రాంతంలోనే ఉన్నారు అని ఆయన కుటుంబ సభ్యులు చెప్పడమే దీనికి కారణం. ప్రమాదం జరిగిన రోజు మహష్ జీరావాలా (Mahesh Jirawala) అహ్మదాబాద్లోని లా గార్డెన్లో ఒక వ్యక్తిని కలవడానికి వెళ్లారని మహేష్ భార్య హేతల్ తెలిపారు.
దీంతో ఆయన ప్రమాదంలో మృతి చెందారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి 700 మీటర్ల దూరంలోనే అతడి ఫోన్ ఉన్నట్లు పోలీసులు లొకేషన్ ఆధారంగా గుర్తించడం గమనార్హం. దీంతో మహేష్ జీరావాలా (Mahesh Jirawala) కుటుంబ సభ్యులుభయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటితో గుర్తు తెలియని మృతదేహాల డీఎన్ఏను సరిపోల్చి నిర్ణయానికి రానున్నారు.
నరోదా ప్రాంతానికి చెందిన మహేశ్ జీరావాలా (Mahesh Jirawala) అసలు పేరు మహేశ్ కలవాడియా.. మ్యూజిక్ ఆల్బమ్స్కు దర్శకత్వం వహిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యారు. మహేష్ గురువారం మధ్యాహ్నం 1.14కు ఫోన్ చేశాడు. మీటింగ్ అయిపోయిందని కాసేపట్లో ఇంటికి బయల్దేరుతా అని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఎంతసేపటికీ ఆయన నుండి సమాచారం రాలేదు. దీంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చాను.
విచారణ జరిపిన పోలీసులు విమాన ప్రమాదం జరిగిన 700 మీటర్ల దూరంలో మహేష్ ఫోన్ను గుర్తించారు అని ఆయన భార్య హేతల్ తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మహేష్ కూడా చనిపోయారేమో అని అంచనాకు వచ్చారు. మహేష్ ఎప్పుడూ ఎప్పుడూ ఆ మార్గంలో ఇంటికి రాడు. దురదృష్టవశాత్తూ ఆ రోజు ఆ మార్గాన్ని ఎంచుకున్నారేమో అని మహేశ్ భార్య హేతల్ ఆవేదన వ్యక్తం చేశారు.