నందమూరి అభిమానులకు ప్రస్తుతం ఉన్న అతి పెద్ద డౌట్స్, ఇంట్రెస్టింగ్ చర్చలు ఏంటి అంటే.. ఒకటి మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడు, రెండోది బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా చెబుతున్న ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్. మామూలుగా అయితే ఈ రెండింటిలో ఒకటి ఇప్పటికే అయిపోయి ఉండాలి. రెండో దాని గురించి పెద్దగా చర్చ జరగకుండా ఉండాలి. కానీ ఏమైందో ఏమో ఎప్పుడో అయిపోవాల్సిన మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇంకా అవ్వలేదు. ఎప్పుడో అనౌన్స్ అయిన ‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్ ఇంకా స్టార్ట్ కాలేదు.
ఈ రెండూ కలిపి ఒకేసారి అయిపోతాయని, ఆ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ కెప్టెన్ అవుతాడని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ సినిమా కోసం మోక్షజ్ఞ ఇప్పుడు రెడీ అవుతున్నాడని.. గతంలో అనౌన్స్ అయిన ప్రశాంత్ వర్మ సినిమాను స్టార్ట్ చేయకుండా ఆపేశారని అంటున్నారు. మరి ఈ విషయం క్రిష్ దరగ్గర ప్రస్తావిస్తే.. ఆ సినిమాను ప్రకటించాల్సింది బాలయ్యే అని.. దాని గురించి నేనేం మాట్లాడలేను అని తేల్చి చెప్పారు క్రిష్.
మరి మోక్షజ్ఞ సంగతేంటి అని అడిగితే.. ఈ సినిమాలో మోక్షజ్ఞ నటించేది లేనిది కూడా బాలయ్యే చెప్పాలన్నారు. బాలయ్య నోటి నుండే ఈ సినిమా విషయాలు వినాలి తేల్చేశారు క్రిష్. మొన్నీమధ్య ‘ఘాటి’ నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డిని ఇదే విషయం అడిగితే.. చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. క్రిష్ అయితే ఆ స్థాయి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అయితే అంతా ఓకే అయిపోయిందని, ‘ఘాటి’ సినిమా అయిపోయాక బాలయ్య సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు అని అంటున్నారు.
బాలయ్య మంచి ముహూర్తం కోసం చూస్తున్నారని.. అంతా కుదిరాక ఆయనే అధికారికంగా వెల్లడిస్తారని చెబుతున్నారు. ఆ సినిమాకు క్రిష్తోపాటు, బాలకృష్ణ తనయ తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అనౌన్స్ అయిన సినిమాకు కూడా తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పిన విషయం తెలిసిందే.