టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. గ్లోబల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్, ఈ సినిమాతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్పై కన్నేశారు. సుమారు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండటంతో, మహేష్ తర్వాతి అడుగు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
నిజానికి రాజమౌళి సినిమా తర్వాత మహేష్ రేంజ్ కంప్లీట్ గా మారిపోతుంది. అందుకే తదుపరి సినిమా డైరెక్టర్ ఎవరనే విషయంలో మహేష్ అప్పుడే ఏ నిర్ణయం తీసుకోవడం లేదట. రీసెంట్గా ఒక సన్నిహితుడు ‘నెక్స్ట్ ఏంటి?’ అని అడిగితే, మహేష్ మాత్రం చాలా కూల్గా ‘అప్పుడే తొందరెందుకు’ అన్నట్లు సమాధానం ఇచ్చారట. ప్రస్తుతం తన దృష్టంతా జక్కన్న సినిమాపైనే ఉందని, ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని హింట్ ఇచ్చారు.
టాలీవుడ్లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. భారీ హిట్లు ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేసినా, రిజల్ట్ మాత్రం అంచనాలను అందుకోవడం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ విషయంలో చాలా టైమ్ తీసుకున్నా డివైడ్ టాక్ వచ్చింది. ఇక రామ్ చరణ్ అయితే శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్తో ‘గేమ్ ఛేంజర్’ చేసినా అది బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ పరిణామాలు చూశాక మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలని డిసైడ్ అయ్యారట.
మహేష్ బాబుకు ఒక అలవాటు ఉంది, ఆయన ఏ డైరెక్టర్కైనా ఓకే చెప్పే ముందు వారి ట్రాక్ రికార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కేవలం కథ మాత్రమే కాదు, సదరు దర్శకుడికి ఉన్న బాక్సాఫీస్ స్టామినా ఎంత? చివరి సినిమా రిజల్ట్ ఏంటి? అనే అంశాలను బేరీజు వేసుకుంటారు. రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ స్టార్గా మారబోతున్న తరుణంలో, ఆ స్థాయిని మ్యాచ్ చేసే దర్శకుడు దొరికితేనే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. ఆ లక్కీ డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.