‘ఈశ్వర్’ కథ మహేష్ వద్దకు వెళ్ళిందా? అసలు మేటర్ ఏంటి?

  • November 19, 2022 / 12:55 PM IST

ప్రభాస్ హీరోగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం ‘ఈశ్వర్’. టాలీవుడ్ కు పలు సూపర్ హిట్లు అందించిన జయంత్ సి పరాన్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సీనియర్ నటుడు విజయ్ కుమార్ చిన్న కూతురు శ్రీదేవి విజయ్ కుమార్ కూడా ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2002 వ సంవత్సరం నవంబర్ 11న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇటీవల ఈ చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ మూవీ గురించి బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాని ప్రభాస్ లాంచింగ్ మూవీగా చేయలేదని.. తక్కువ బడ్జెట్ లో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని తీయాలనే ఉద్దేశంతో తీసిన మూవీ ఇదని జయంత్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు మహేష్ కూడా ఈ మూవీ కథ పై ఇంట్రెస్ట్ చూపించినట్టు జయంత్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన మాట్లాడుతూ..” ‘ఈశ్వర్’ సినిమా సెట్స్ కు మహేష్ బాబు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

అతను నాకు చాలా మంచి స్నేహితుడు. ‘ఈశ్వర్’ సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు రోజుల ముందు.. మహేష్ కు నేను స్పెషల్ గా ఈ మూవీని చూపించాను. సినిమా చూసి అతను చాలా బాగుంది అని చెప్పాడు. అంతేకాదు ఈ కథ నాతో ఎందుకు చేయలేదు.. నేను చేసుండేవాడిని కథా అన్నాడు” అంటూ జయంత్ చెప్పుకొచ్చాడు. నిజానికి ‘ఈశ్వర్’ పెద్ద హిట్టు సినిమా కాదు. ఆ విషయాన్ని కూడా జయంత్ అంగీకరించాడు.

‘ఈ సినిమా సోమవారం రోజున రిలీజ్ అయ్యింది. అందువల్ల జనాలకు ఈ మూవీ రీచ్ అవ్వలేదు. అదే శుక్రవారం రోజున కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఫలితం మరోలా ఉండేది’ అని కూడా జయంత్ చెప్పుకొచ్చాడు. 3 నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ ను ఫినిష్ చేసి రిలీజ్ చేశాడట జయంత్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus