అక్కినేని నాగార్జునను జపనీయులు గొప్పగా పిలుచుకుంటారు అని ఈ మధ్య మనం ఓ వార్త చదువుకున్నాం. ఏ టాలీవుడ్ హీరోకు దక్కని గౌరవం (సమా)ను ఆయను అక్కడ పొందుతున్నారు అని చదువుకున్నాం. ఇప్పుడు వారి కోసం నాగార్జున టీమ్ ఓ ప్లాన్ చేసింది. అక్కినేని కుటుంబానికి ఎంతో కీలకమైన, ప్రీతిపాత్రమైన ‘మనం’ సినిమాను రీరిలీజ్ చేయబోతోంది. అయితే అది కేవలం జపాన్లో మాత్రమే. విడుదలై పదేళ్లు అయిన ఈ సినిమాను ఇప్పుడు అక్కడి వాసులు థియేటర్లలో చూడబోతున్నారు.
ఆగస్టు 8న ఈ సినిమాను జపాన్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నాగార్జున అక్కడి అభిమానులతో వర్చువల్గా సమావేశం అవుతారట. దీని కోసం జపాన్లో ఓ థియేటర్ను వెన్యూగా తీసుకుంటున్నారట. అంటే అక్కడ ఫ్యాన్స్ అందరూ ఉంటే.. ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారట నాగార్జపున. అయితే అది కేవలం ఫ్యాన్స్తో మాట్లాడటమా లేక సినిమా స్క్రీనింగ్ అయ్యాక మాట్లాడటమా అనేది తెలియాల్సి ఉంది.
అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా ‘మనం’. ఆ సినిమాలో మొత్తం అక్కినేని కుటుంబమంతా కనిపిస్తుంది. ఆ కుటుంబ హీరోలు అందరినీ చూడొచ్చు. కథ, కథనం చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అయితే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ చాలా పక్కాగా సినిమాను తీసుకొచ్చారు. అందుకే మన దగ్గర మంచి విజయం అందుకుంది. మరి జపనీయులు సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలి. ఇక పైన చెప్పినట్లు నాగార్జున గౌరవం గురించి చూస్తే.. జపాన్లో నాగార్జునను నాగ్ సమా అని పిలుస్తున్నారు. మనం గౌరవం, మర్యాద ఇచ్చేటప్పుడు ‘గారు’ అని అంటుంటాం కదా అలా జపనీయులు ‘సమా’ అని అంటారట.
జపాన్లో దేవుళ్లు, రాజులను, గొప్పవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఆఖరులో సమా అనే పదం జోడిస్తారు. ఆ గౌరవం ఇప్పుడు నాగార్జునకు దక్కింది. దీనికి సంబంధించి జపనీయుల సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.