‘మోక్షు.. మంచి ప్రేమ కథ కోసం చూస్తున్నాడు..’ కొన్ని నెలల క్రితం నారా రోహిత్ చెప్పిన మాట ఇది. దీంతో లవర్ బాయ్గా నందమూరి వారసుడు ఎంట్రీ ఇస్తాడేమో అనుకున్నాంతా. అప్పటికే ఓ యాక్షన్ సినిమా కథ (ప్రశాంత్ వర్మ సినిమా)ను ముహూర్తం వరకు తీసుకొచ్చి ఆపేయడంతో.. నారా రోహిత్ మాటే నిజం అనుకోవాల్సి వచ్చింది. అయితే మోక్షజ్ఞ ఉద్దేశం ప్రేమకథ కాదని.. రీసెంట్ మల్లిడి వశిష్ట సినిమా అనౌన్స్మెంట్తో తేలిపోయింది.
అయితే, ఇప్పుడు మరో విషయం ఒకటి బయటకు వచ్చింది. మోక్షజ్ఞ చేయబోతున్న కథ పునర్జన్మ కథ అని చెబుతున్నారు. అంటే ‘మగధీర’, ‘ఈగ’, ‘బింబిసార’ టైప్ కథ అట. ఇలాంటి కథ చేయాలని అనుకునే ఇన్నాళ్లూ బాలయ్య ఆగారని.. ఇప్పుడు వశిష్ట నుండి ఆ కథ రావడంతో వెంటనే ఓకే చేశారని టాక్. ఎందుకంటే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్రను మరో జన్మలో మోక్షజ్ఞ చేస్తాడట.
మల్లిడి వశిష్ట కథలు డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు చేసిన ‘బింబిసార’, చేస్తామని వదిలేసిన ‘బింబిసార 2’, చేసి పక్కన పెట్టిన ‘విశ్వంభర’ ఈ మరో జన్మ కథలే. ఆ లెక్కన ఈ రూమర్లకు బలం చేకూరింది. ఇదంతా చూస్తుంటే ‘ఆదిత్య 999 మ్యాక్స్’ కథనే ఇలా మార్చి తీస్తున్నారా అనే డౌట్ కూడా ఉంది. అందులో పునర్జన్మలు ఉండవు కానీ.. పాత్రలు వివిధ కాలాల్లో ఉంటాయి. ఈ విషయం జనానికి దసరాకు తేలిపోవాలి. కానీ ఆలస్యం అవుతుందని టాక్.
ఎందుకంటే ఈ సినిమాను తొలుత దసరాకు లాంఛనంగా ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ కొంచెం ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. అయితే ఈ సంవత్సరం చివర్లో సినిమాను కచ్చితంగా సెట్స్ మీదకు తీసుకొస్తారట. బాలయ్యకు అచ్చొస్తున్న డిసెంబరులో గానీ, సంక్రాంతికి సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.