మహేష్బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) సినిమా గురించి అప్డేట్స్ అంటే.. ఒడిశాలోని కొండల్లో షూటింగ్ జరిగింది అనే టాపిక్ ఒకటే తెలుసు. అయితే సినిమా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) మరో విషయం చెప్పారు. నిజానికి ఆయన చెప్పిన మాటలు సినిమా మీద హైప్ను పెంచేలా ఉన్నాయి. అయితే ఇదంతా సినిమా సంగీతం నేపథ్యంలోనే ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తాను పని చేసిన వాటిల్లో ఇది కష్టమైన ప్రాజెక్టు అని చెప్పారు.
తాను సంగీతం అందించే ప్రతి సినిమాకీ సవాళ్లు పెరుగుతూనే ఉంటాయని, ప్రతి సినిమాకు ఆ కథకు తగ్గట్టు తగ్గట్టు కొత్త సౌండ్స్ సృష్టించాలని చెప్పారు. మహేష్బాబు – రాజమౌళి సినిమా లాంటిది ఇంతకు ముందెన్నడూ రాలేదు అని కీరవాణి చెప్పారు. ఈ సినిమా ఒక అడ్వెంచర్ అని, కష్టమే అయినా సినిమా ఓ ఆసక్తికర ప్రయాణమని చెప్పుకొచ్చారు. ప్రపంచాన్ని చుట్టొచ్చే వీరుడి కథ ఈ సినిమా అని ఇప్పటికే రాజమౌళి ప్రాథమికంగా చెప్పేసిన విషయం తెలిసిందే.
ప్రపంచాన్ని సినిమాలో చూపించే క్రమంలో కీరవాణి ప్రత్యేకమైన సంగీతం ఇవ్వాల్సిందే. సంగీతం గురించి చెబుతున్నాం కాబట్టి కీరవాణికి ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది ఆయన దగ్గర ఇటీవల ప్రస్తావిస్తే.. కేవీ మహదేవన్, ఆర్.డి. బర్మన్ ప్రభావం ఉందని చెప్పారు. అంతేకాదు సంగీతం విషయంలో కొత్తగా ప్రయత్నించే ప్రతి సంగీత దర్శకుడి నుండి తాను ఏదో ఒక విషయం నేర్చుకుంటా అని కీరవాణి చెప్పారు.
మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవితో (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా చేస్తున్న కీరవాణి.. బాలీవుడ్లో అనుపమ్ ఖేర్ డైరెక్ట్ చేస్తున్న ‘తన్వి: ది గ్రేట్’కి కూడా సంగీతం అందిస్తున్నారు. ‘నా టూర్ ఎం.ఎం.కె’ పేరుతో శనివారం కాన్సర్ట్ నిర్వహించారు. 150 మందితో 30కిపైగా బెస్ట్ సాంగ్స్తో కాన్సర్ట్ నిర్వహించారు. దీనికి భారీ స్పందన వచ్చింది.