సీనియర్ స్టార్ హీరోలకు విలన్లుగా కుర్ర హీరోలు లేదంటే కుర్ర నటులు.. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాంబినేషన్లు ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు ఈ కాంబో సెట్ చేస్తున్నారు అంటే ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఈ కాంబోకు విజయాలు చూసి చాలామంది దర్శకులు ఇలాంటి కాంబోలే సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున కోసం కూడా దర్శకుడు రా కార్తిక్ ఇలాంటి సెటెప్పే చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. కింగ్ 100గా రూపొందుతున్న ఈ సినిమా కోసం తమిళ నటుడినే విలన్గా తీసుకొస్తున్నారట.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే యువ తమిళ నటుడు అశోక్ సెల్వన్.. కింగ్ 100 సినిమాలో నాగార్జునను ఢీకొడతాడని సమాచారం. సంక్రాంతికి రిలీజ్ అనే టార్గెట్ పెట్టుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి త్వరలో ఓ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారట. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్తోపాటు సినిమాలోని కీలక నటులు ఎవరు అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది అని చెబుతున్నారు. తొలుత డిసెంబరులో సినిమాను తీసుకొస్తారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు సంక్రాంతికే ఫిక్స్ అయిపోయారట.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఈ సినిమాలో నాగార్జున సరసన టబు ఓ హీరోయిన్. ఐశ్వర్య రాజేశ్, సుస్మిత భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. 28 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలసి నటిస్తుండటం గమనార్హం. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అక్కినేని హీరోలు, కుటుంబ సభ్యులు అతిథి పాత్రల్లో కనిపిస్తారని టాక్. నాగ్ వందో సినిమా కావడంతో ఈసారి మెమొరబుల్గా ఉండాలని ఇలా ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పటికే సంక్రాంతికి వరుస సినిమాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఏ డేట్ని ఫిక్స్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జనవరి 12, 13, 14 తేదీలు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగ్ అయితే ముందు రావాల్సిందే. లేదంటే పండగ తర్వాత రావాల్సిందే.