జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) డెబ్యూ మూవీగా.. ‘మ్యాడ్’ (MAD) వచ్చింది. ఆ తర్వాత రెండో సినిమాగా ‘ఆయ్’ (AAY) వచ్చింది. ఇవి రెండూ మంచి విజయాలు నమోదు చేశాయి. సీక్వెల్ క్రేజ్ తో వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా నార్నె నితిన్ కథలో హ్యాట్రిక్ పడినట్టు అయ్యింది. ఇటీవల కాలంలో ఓ హీరోకి వరుస విజయాలు పడటం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయంలో నార్నె నితిన్ కి పాస్ మార్కులు పడ్డాయని చెప్పాలి.
అయితే నార్నె నితిన్ మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అనే విషయం చాలా మందికి తెలీదు. అవును నార్నె నితిన్ డెబ్యూ మూవీగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ (Sri Sri Sri Raja Vaaru) మొదలైంది. నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి సతీష్ వేగేశ్న (Satish Vegesna) ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్రీ వేదాక్షర మూవీస్’ పతాకంపై చింతపల్లి రామారావు (Chintapalli Ramana) ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నార్నె నితిన్ కూడా ‘ఆయ్’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. కానీ నిర్మాత మాత్రం ఈ సినిమా ఆగిపోలేదని, నార్నె నితిన్ ఫ్యామిలీ ఈ సినిమా విడుదలని కొంతకాలం ఆపాలని తనని బ్రతిమాలిందని.. ఇక ఆగేది లేదని చెప్పి జూన్ 6 కి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే హీరో నార్నె నితిన్ ఈ సినిమాని మినిమమ్ పట్టించుకోవడం లేదు.
ప్రమోషన్స్ కి కూడా హాజరైంది అంటూ లేదు. దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత మాత్రమే ప్రమోట్ చేసుకున్నారు. వాటి డోస్ కూడా సరిపోలేదు. సినిమాకి ఎంత భారీ ప్రమోషన్ చేసినా.. హీరో ప్రమోట్ చేయడం అనేది వేరు. ఇక్కడ నార్నె నితిన్ తన మార్కెట్ దెబ్బ తింటుందేమో అనే భయంతో ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ ని లైట్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది.