ఇండియన్ సినిమాల్లో మిస్టరీ/ థ్రిల్లర్ సినిమాలు అంటూ ఓ లిస్ట్ రాస్తే.. అందులో మూడు ప్లేస్లు ఆక్యుపై చేసే దర్శకుడు జీతూ జోసెఫ్. అవే ‘దృశ్యం’, ‘దృశ్యం 2’, ‘దృశ్యం 3’. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూడు సినిమాలు ఒకే లైన్ పట్టుకుని తీసిన సినిమాలే. ఈ మూడు సినిమాలు మంచి విజయం సాధించి ఇటు మోహన్లాల్కు, అటు జీతూ జోసెఫ్కు మంచి పేరే తీసుకొచ్చాయి. అయితే తొలి రెండు సినిమాలకు వచ్చిన స్పందన.. మూడో సినిమాకు రాలేదు. సినిమా విజయం సాధించినా.. ఎక్కడో చిన్నగా అసంతృప్తి కనిపించింది.
ఇక్కడితో సినిమా సిరీస్ ఆపేస్తున్నారో ఏమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు చూస్తే ‘దృశ్యం 4’ సినిమాను ప్రకటించారు. సేమ్ కాంబినేషన్లో ఈ సినిమా అని ప్రకటించేశారు. కథ లైన్ విషయంలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటి అంటే.. ‘ఇంకెంత లాగుతారు.. ఇంకా లాగితే తెగిపోతుందేమో’ అనే ప్రశ్న వస్తోంది. ‘దృశ్యం’ సినిమా ఇంట్రెస్టింగే కావొచ్చు.. కానీ ఎక్కడో దగ్గర ముగింపు ఉండాలి కదా అనిపిస్తోంది.
13 సంవత్సరాల క్రితం అంటే 2013లో మొదలైన ఈ ఫ్రాంచైజీలో తొలి భాగం భారీ విజయం సాధించాక.. ఇతర బాషల నుండి రీమేక్ రిక్వెస్ట్లు వచ్చాయి. అలా వెంకటేష్ తెలుగులో ‘దృశ్యం’ అని.. అజయ్ దేవగణ్ హిందీలో ‘దృశ్యం’ అని.. కమల్ హాసన్ తమిళంలో ‘పాప నాశనం’ అని.. రవిచంద్రన్ కన్నడలో ‘దృశ్య’ అని తీశారు. అన్ని చోట్లా భారీ విజయాలే దక్కాయి. రెండో ‘దృశ్యం’ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఆ తర్వాత మూడో భాగానికి వచ్చేసరికి నేరుగా మోహన్లాల్ అన్నిచోట్లా రిలీజ్ చేశారు హిందీ తప్ప.
మరిప్పుడు నాలుగో ‘దృశ్యం’ మొత్తం మోహన్లాల్ సినిమాగానే వస్తుందా? లేక అజయ్ దేవగణ్ హిందీలో చేసుకుంటాడా అనేది చూడాలి. ఎందుకంటే ఇంకా హిందీలో ‘దృశ్యం 3’ ఇంకా రాలేదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. అయితే హిందీలో మూడో ‘దృశ్యం’ కథ మలయాళ ‘దృశ్యం 3’ కథ ఒకటి కావు.