Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Advertisement

తెలుగు సినిమాలకు ఫస్ట్‌ రివ్యూలు మీరు చాలానే చూసి ఉంటారు. కొన్ని సినిమాలకు ఆఖరి రివ్యూలు కూడా ఉంటాయి. అవే ‘పరుచూరి పలుకులు’. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ పని చేస్తూ ఉంటారు. సినిమా తీయడం, రాయడంలో చేసిన తప్పుల గురించి వివరంగా చెబుతూ ఉంటారు. తాజాగా ఆయన పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా గురించి మాట్లాడారు. సినిమా విషయంలో జరిగిన తప్పులు ఏంటనేది వివరంగా చెప్పుకొచ్చారు.

Paruchuri Gopala Krishna

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా చూసిన మెయిన్‌ పాయింట్‌ నుండి కథ, కథనాలు, పక్కకు వెళ్లాయా అనిపించింది. ఉస్తాద్‌ చిన్నప్పటి కథతో ‘పిల్లలు పనిలోకి కాదు బడిలోకి వెళ్లాలి’ అనే మెసేజ్‌ ఇచ్చారు. పవన్‌ బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలో కమర్షియాలిటీ జోడించారు. ఈ సినిమా కేవలం ఉగ్రవాదుల్ని అంతం చేసే పోలీస్‌ ఆఫీసర్‌ కథ మాత్రమే కాదు అని చెప్పేలా సెకండాఫ్‌లో లవ్‌ స్టోరీని కూడా జోడించారు. ఇక్కడే చిన్న పొరపాటు చేశారనిపించింది అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.

సినిమా స్క్రీన్‌ప్లేలో చిన్న దోషం ఉంది. కొంత లవ్‌ స్టోరీని ఫస్ట్‌ హాఫ్‌లో చూపించి, మిగిలింది సెకండాఫ్‌కి తీసుకెళ్లి ఉంటే బాగుండేది. పవన్‌ని చూడటానికి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులకు మొదటి 20 నిమిషాలు చిన్ననాటి సన్నివేశాలే చూపించారు. అలా కాకుండా ఆ సీన్స్‌ను పది నిమిషాలకు కుదించి, పవన్‌ సీన్స్‌ యాడ్‌ చేయాల్సింది. హీరో ఎంట్రీ లేటైతే, సినిమాకు ప్రమాదం. ఈ సినిమా విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది.

సీనియర్‌ నటుడు పార్తిబన్‌ను విలన్‌గా ఒప్పించడం సాహసం. ఆ పాత్రను ముగించిన తీరు బాగుంది. ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు సినిమా టైటిల్‌ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ‘భగత్‌ సింగ్‌’ స్వరాజ్యం కోసం పోరాటం చేసి, ప్రాణ త్యాగం చేశాడు. అందుకే ఈ సినిమాకు ఆ పేరు కాకుండా ఇంకేదైనా పెట్టి ఉంటే ప్రేక్షకుడి ఆలోచన మరోలా ఉండేదేమో. అలాగే సినిమాలోని కొన్ని అనవసర పాత్రలు కూడా ఇబ్బంది పెట్టాయి. వాటి వల్ల కథ పరిధి దాటిపోయింది అని పరుచూరి అన్నారు.

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus