బ్లాక్ లో టికెట్స్ అమ్మడంపై రజనీకాంత్ ఫైర్

  • November 21, 2018 / 06:27 AM IST

భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం 2.ఓ. రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సాంకేతికంగా కూడా అద్భుతాలను సృష్టిస్తుందని అంటున్నారు. ఇప్పటికే మిన్నంటిన అంచనాల మధ్యన తమిళ, తెలుగు, హిందీ, మలయాళ వంటి పలు భాషల్లో ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా పేరున్న పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతుంటే వెంటనే చిత్రాన్ని చూసేయాలని ప్రేక్షకాభిమానులు ఎంతగా తహ తహ లాడతారో తెలియంది కాదు. ఏదో విధంగా టిక్కెట్లను దక్కించుకోవాలని ఆశిస్తుంటారు.

ఈ నేపథ్యంలో బ్లాక్‌లో కూడా టిక్కెట్లను కొనుక్కుంటుంటారు. దీనిని ఆసరా చేసుకుని విడుదలయ్యే చిత్రానికి ఉండే క్రేజ్‌కు తగ్గట్టుగా బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మేవ్యక్తులు వేల రూపాయలు డిమాండ్‌ చేయడం వింటున్నదే. ఇప్పుడు రజనీకాంత్‌ 2.0 చిత్రానికి ఉండే క్రేజ్‌కు అనుగుణంగా రెండు వందల రూపాయల టిక్కెట్‌కు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు బేరసారాలు జరుపుతున్నారట. దీనిపై రజనీకాంత్‌ హెచ్చరిక జారీ చేశారు. థియేటర్లలో అభిమానులుగా, పార్టీ కార్యకర్తలుగా టిక్కెట్లు పొందినవారు బయట విక్రయించరాదని, యాజమాన్యం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లను వసూలు చేయరాదని…దీనిని అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకుంటామంటూ రజనీ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus