హిట్ సినిమాకు, బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్స్ తీయడానికి నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. అలా వచ్చిన సినిమాలకు ఊహించని అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోలేక సినిమాల ఫలితాలు ఇబ్బందులు పెడుతుంటాయి. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఓ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ చేయడానికి హీరో, దర్శకుడు రెడీ అవుతున్నారు. నిర్మాత కూడా ఓకే అంటున్నారు. ఆ సినిమానే ‘రిపబ్లిక్’. ఈ సినిమాకు కొనసాగింపు కోసం కథ సిద్ధమైందట.. త్వరలో కొబ్బరికాయ కొట్టడమే మిగిలిందట.
‘రిపబ్లిక్’.. దేవా కట్టా, సాయితేజ్ ఎంతో నమ్మకంతో చేసిన సినిమా. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీసు దగ్గర ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సినిమా రాజకీయ పరమైన చర్చల మధ్యలో ఇరుక్కోవడం కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అవన్నీ ఇప్పుడు వదిలేసి.. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని దర్శకుడు దేవా కట్టా నిర్ణయించుకున్నారనే విషయాన్ని చెప్పుకోవాలి. దీని కోసం ఇప్పటికే సాయితేజ్కి కథ కూడా చెప్పారని తెలుస్తోంది.
‘రిపబ్లిక్’ సినిమాకు కథకు సీక్వెల్ అనేదే పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. ఆ సినిమా ముగింపుతో మరో సినిమా ఎత్తు కోవడం అంత సాధ్యం కాదు. కానీ దానికి రిలేటెడ్ కథతో ఇప్పుడు దేవా కట్టా ఓ లైన్ సిద్ధం చేశారట. ఈ క్రమంలో ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారా? నిర్మాత దొరికినా ఓటీటీకి సినిమాను అమ్ముకోగలరా, థియేట్రికల్ రిలీజ్కి సంబంధించి బయ్యర్లు కొంటారా? సినిమాకు కావాల్సిన హైప్ వస్తుందా అనేది తెలియడం లేదు.
అయితే దర్శకుడి మీద, ఆయన పనితనం మీద నమ్మకంతో సాయితేజ్ ఈ సినిమా చేయడానికి ముందుకొస్తున్నారు. ‘సంబరాల యేటి గట్టు’తో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్న సాయితేజ్ ఆ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ అంటే ఆలోచించుకోవాల్సిన విషయమే.