గతేడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ వచ్చి భారీ విజయం అందుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ‘గేమ్ ఛేంజర్’ పోయినా ఈ సినిమా ఇచ్చిన విజయం వారిని తిరిగి నిలబెట్టింది. ఈ ఏడాది నిర్మాతగా సంక్రాంతికి రాకపోయినా డిస్ట్రిబ్యూటర్గా సినిమాలు రిలీజ్ చేసి బాగానే లాభాలు వెనకేసుకున్నారని టాక్. అయితే ఇప్పుడు మేం చెబుతున్నది సంక్రాంతి పండగ గురించి కాదు. రంజాన్ పండగ గురించి. వచ్చే ఏడాది రంజాన్కు వస్తాం అని దిల్ రాజు ఫిక్స్ అయ్యారట.
చాలా ఏళ్లుగా బాలీవుడ్లో సరైన సోలో లాంచ్ కోసం చూస్తున్నారు దిల్ రాజు. ఇప్పటికే చాలా మంది హీరోలతో ఈ మేరకు ప్రయత్నాలు జరిగినా ఏదీ వర్కవుట్ కాలేదు. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్లోనే ఆ సినిమా ఉండనుంది అని చాలా నెలలుగా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పేరు చర్చలోకి వచ్చింది. ఆయనకు వంశీ కథ చెప్పి ప్రాథమికంగా ఓకే చేసుకున్నారు అని టాక్. ఇప్పుడు ఆ సినిమా విడుదలకు ముహూర్తం పెట్టేశారట.
సల్మాన్ ఖాన్కు బాగా కలిసొచ్చే రంజాన్ పండగక్కే ఆ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే 2027 మార్చి తొలి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సమ్మర్లో సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారట. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ఇనిమాలో బిజీగా ఉన్నాడు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే పేరుతో ప్రారంభమైన ఈ సినిమా పేరును ఇప్పుడు మార్చేశారు. ఈ సినిమాతో సల్లూ భాయ్ తన మ్యాజిక్ చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ సినిమాను ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్కి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి పనులు అవ్వలేదు. దీంతో వచ్చే ఈద్ మీద సల్మాన్ చూపు పడింది అంటున్నారు.