వరుస సినిమాలు చేస్తూ, మధ్యలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఆ తర్వాత బంధం నుండి విడిపోయాక తిరిగి సినిమాల వైపు వచ్చేలా కనిపించింది. అయితే సినిమాల్లోకి కాకుందా వెబ్సిరీస్లవైపు దృష్టి సారించింది. అక్కడ కూడా మంచి విజయలే అందుకుంది. ఇక సినిమాలవైపు, సౌత్ వైపు రాదేమో అనుకుంటుండగా.. ‘మా ఇంటి బంగారం’ అంటూ ఓ సినిమా అనౌన్స్ చేసింది. ఆ సినిమాలో నటించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరిస్తానని చెప్పి షాకిచ్చింది కూడా. దీని కోసం ‘ట్రా లా లా పిక్చర్స్’ బ్యానర్ను ఏర్పాటు చేసింది కూడా.
ఆ సినిమా అనౌన్స్ అయిన ఏడాది దాటిపోయింది. కచ్చితంగా చెప్పాలంటే 17 నెలలు అవుతోంది. దీంతో పరిస్థితి అర్థం కాక ఆమె అభిమానులు తలలు పట్టుకున్నారు. ఏంటీ సమంత నిర్మాతగా అనౌన్స్ చేసిన తొలి సినిమా ఆగిపోయిందా అనుకున్నారంతా. అలా అని బ్యానర్ మూసేసిందా అంటే లేదు. కొత్త టీమ్తో తీసిన ‘శుభం’ సినిమా ఆ బ్యానర్లో రెండో సినిమా. దీంతో కథ లేదంటే రచయిత విషయంలో ఏదో ఇబ్బంది వచ్చి ఉండొచ్చు అనుకున్నారంతా. ఇప్పుడదే నిజమైంది. గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లు నిజమయ్యాయి.
సమంత నిర్మాతగా అనౌన్స్ చేసిన తొలి సినిమా ‘మా ఇంటి బంగారం’ సినిమా చిత్రీకరణ ప్రారంభించుకుంది. తనకు ‘ఓ బేబీ’ లాంటి హిట్ సినిమా ఇచ్చిన నందిని రెడ్ది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సమంత, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. 1980 కాలం నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో సమంత సరికొత్త లుక్లో కనిపించనుంది.
నిజానికి ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడితో తెరకెక్కించాలని సమంత భావించింది. అయితే వివిధ కారణాల వల్ల నందిని రెడ్డి ఇప్పుడు సినిమాను హ్యాండిల్ చేస్తున్నారు. ఇద్దరికీ ఇప్పుడు ఈ సినిమా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంది.