టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజకు పేరుంది. రీసెంట్ కెరీర్ చూస్తే మూడేళ్లయింది ఆయనకు హిట్ వచ్చి. ముఖ్య పాత్రలో అయితే రెండేళ్ల క్రితం విజయం అందుకున్నారు. ఈ ఏడాది ‘మాస్ జాతర’ అంటూ వాయిదాలు పడుతూ పడుతూ వచ్చి ఇబ్బందికర ఫలితమే అందుకుంది. దీంతో జోనర్ మార్చాలని మాస్ మహారాజ్ ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగానే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఫ్యామిలీ టచ్ ఇస్తున్నాడు. ఆ తర్వాత కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాడట.
రవితేజ – శివ నిర్వాణ కాంబినేషన్లో ఓ సినిమా ఉండొచ్చు అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇప్పుడు దాని గురించే కొత్త చర్చలు బయటకు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈసారి శివ నిర్వాణ థ్రిల్లర్ కాన్సెప్ట్ను నమ్ముకున్నారట. ఇక ఈ సినిమాలో కథానాయికగా సమంత పేరు ప్రచారంలో ఉంది. శివ నిర్వాణ – సమంత కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కావడం గమనార్హం.
ఇక రవితేజ కెరీర్ చూస్తుంటే మళ్లీ 2017 నుండి 2021 పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పాలి. అప్పుడు కూడా ఇలా వరుస సినిమాలు పోయాక ‘క్రాక్’ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు అలాంటి విజయం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత దర్శకుడు కిషోర్ తిరుమల మీద పడింది. ఆయన రవితేజ హీరోగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విజయం రవితేజకు అత్యవసరం అయిపోయింది. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే పాత్రలో రవితేజ కనిపిస్తాడట. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని ఫిక్స్ అయి ఉన్నారు.
ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ సినిమా వస్తే అతని మీద కూడా బరువు ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా ఈ సినిమా ఆశించినంత ఈజీ కాదు. అందులోనూ గత సినిమా ‘ఖుషి’ బాక్సాఫీసు దగ్గర ఇబ్బందికర ఫలితం అందుకుంది.