బుల్లితెర పరిశ్రమలో విషాదం..సీనియర్ కెమెరామేన్ మృతి.. ఆ సమస్య వల్ల మరణించారా?
- April 4, 2024 / 01:56 PM ISTByFilmy Focus
ఈ మధ్య కాలంలో సినీ, బుల్లితెర ఇండస్ట్రీలలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమాలు, సీరియళ్లకు కెమెరామేన్ గా పని చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వెంకటరమణ గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంకట రమణను ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా చికిత్సకు కోలుకోలేక వెంకటరమణ మృతి చెందారు. వెంకటరమణ పూర్తి పేరు పోతన వెంకటరమణ కాగా ఆయన ఎన్నో సీరియళ్లకు కెమెరామేన్ గా పని చేయడంతో పాటు అవుట్ డోర్ యూనిట్ అధినేతగా, ఎడిటర్ గా కూడా పని చేశారు.
పోతన వెంకటరమణ స్వస్థలం మచిలీపట్నం కాగా ఆయన కెమెరామేన్ గా పని చేసిన ఎన్నో సీరియల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. బొమ్మరిల్లు (Bommarillu) , సిరి, సంసారం సాగరం, ఋతురాగాలు సీరియల్స్ ఆయన పాపులారిటీని పెంచాయి. 2009 సంవత్సరంలో ఉత్తమ కెమెరామేన్ గా ఆయనకు నంది అవార్డ్ కూడా వచ్చింది. పోతన వెంకటరమణకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. టీవీ కెమెరామేన్ల సంఘంతో పాటు సినీ, టీవీ ప్రముఖులు వెంకటరమణ మృతికి సంతాపం తెలియజేశారు.

వెంకటరమణ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వెంకటరమణ అంత్యక్రియలు మచిలీపట్నంలో జరగనున్నాయి. పోతన వెంకటరమణ ప్రతిభకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. పోతన వెంకటరమణ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోతన వెంకటరమణ ఇండస్ట్రీలో అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని తెలుస్తోంది. శ్రీ వైనతేయ అనే సీరియల్ కు ఆయన నంది అవార్డ్ అందుకున్నారు. పలు సినిమాలకు సైతం ఆయన కెమెరామేన్ గా పని చేశారని సమాచారం అందుతోంది.













