సినిమా తర్వాత సినిమా.. సినిమా తర్వాత సినిమా.. ఇలా వరుస ప్రాజెక్ట్లు చేసే నిర్మాతలు చాలా తక్కువ ఉంటారు. ఒకవేళ చేసినా చిన్న సినిమాలు, మోస్తరు స్టార్ హీరో ఇమేజ్ ఉన్న కథానాయకుల సినిమాలు చేస్తుంటారు. అయితే బ్లాక్బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కొట్టాక మరో సినిమా చేయడానికి ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకునే నిర్మాతలు మన దగ్గర ఉన్నారు. వాళ్లే ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. ‘బాహుబలి’ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు.
ఆ సినిమాలతో భారీగానే లాభాలు అందుకున్నారు. అయితే ఆ తర్వాత సినిమాలు చేయలేదు. ఏదో ఓ చిన్న సినిమా ఓటీటీ కోసం చేశారు. అది కూడా కో ప్రొడక్షన్ పెట్టుకుని. ఇప్పుడు ఇన్నాళ్లకు బడా ‘బాహబలి’ సినిమాతో మళ్లీ థియేటర్ల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు చిన్న సినిమాలను అనౌన్స్ చేశారు. ఒకటి ఇటీవల మొదలైంది. దీంతో ఆ స్థాయిలో ‘బాహుబలి’తో పేరు, డబ్బు సంపాదించిన ఆర్కా టీమ్ ఎందుకు సినిమాలు తెరకెక్కించడం లేదు అని. దీనిపై నిర్మాత శోభు క్లారిటీ ఇచ్చారు.
ఒక పెద్ద సినిమా చేయాలంటే అన్నీ కలసి రావాలి. కథ, దర్శకుడు, మార్కెట్ పరిస్థితులు… ఇలా అన్నీ కలిసొచ్చినప్పుడే ‘బాహుబలి’ లాంటి పెద్ద సినిమాలు సాధ్యమవుతాయి. మేం కూడా ఎప్పుడూ మంచి కథల్ని ఓకే చేయడం, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై దృష్టిపెడతాం. అందుకే ‘బాహుబలి’ సినిమాల తర్వాత నచ్చిన కథలను ఓకే చేసుకుంటూ పరిమితంగానే సినిమాలు చేశాం. అందుకే పెద్ద హీరోల సినిమాలు చేయలేదు అని చెప్పారు శోభు యార్లగడ్డ.
ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా శశాంక్ యేలేటి దర్శకుడిగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే సినిమాను మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా ఫహాద్తోనే ‘ఆక్సిజన్’ అనే మరో సినిమా ఉంటుంది. ఇవి కాకుండా మరో రెండు కథలు చర్చల దశలో ఉన్నాయట.