సినిమా ప్రెస్ మీట్.. ఒకప్పుడు ఇదే అతి పెద్ద ప్రచార సాధనం. అభిమానులు కూడా దీని గురించి ఆతృతగా ఎదురుచూసేవారు. ఎందుకంటే ఆ సినిమాకు సంబంధించిన కీలక అంశాలను, ఆసక్తికర విషయాలను రివీల్ చేసేవారు. ఇక సినిమా ముందు ఒకప్పుడు ఆడియో రిలీజ్ వేడుక జరగ్గా.. ఆ తర్వాత అది ప్రీరిలీజ్ ఈవెంట్గా మారిపోయింది. అయితే ఇవి సినిమాకు ఒకటే ఉంటాయి. ప్రెస్మీట్లే ఎక్కువగా ఉంటాయి. అంతటి ప్రత్యేకమైన ప్రెస్మీట్లు ఇప్పుడు కళ తప్పుతున్నాయి.
ఓ సినిమాకు హీరో ఎంత ముఖ్యమో, హీరోయిన్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ప్రెస్మీట్కు కూడా హీరో అంతే ముఖ్యం. ఇది ఎవరూ కాదనలేని విషయం. అయితే వారు సినిమా ప్రెస్మీట్లకు ఎందుకు రావడం లేదు. ఓ పోస్టు లేదంటే స్టోరీ పెట్టేసి.. దాన్ని పీఆర్వోలతో షేర్ చేయించి ఎందుకు కామ్ అయిపోతున్నారు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా మూడు పెద్ద సినిమాల ప్రెస్మీట్లకు హీరోలు రాలేదు.
‘ది రాజాసాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ప్రెస్మీట్లో ప్రభాస్ కనిపించలేదు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రమే కనిపించింది. మిగిలిన టీమ్ వచ్చారు. ఇక ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లో చిరంజీవి కనిపించలేదు. కేవలం దర్శకుడు, నిర్మాతలు మాత్రమే వచ్చారు. ఇక ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సాంగ్ లాంచ్కి కూడా హీరో రవితేజ రాలేదు. హీరోయిన్ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ అండ్ టీమ్ వచ్చారు.
ఈ మూడు పెద్ద సినిమాలే. మూడు సంక్రాంతి టార్గెట్గానే వస్తున్నాయి. ఇలాంటి సమయంలో హీరోలు లేకుండా ప్రెస్మీట్లు ఎందుకు. పోనీ తర్వాత పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి వాటికి వస్తారులే అనుకుందాం. కానీ సినిమాను భుజాన మోసి ప్రజల్లోకి తీసుకెళ్తారనే హీరోల మీద అందరికీ నమ్మకం. కానీ ప్రెస్మీట్లకు రాకపోతే ఎలా. సినిమా గురించి ఓ నాలుగు మంచి మాటలు చెబితే జనాల్లోకి వెళ్తాయి కదా.