ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గతకొన్ని రోజులు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలిసిందే. ఆ మధ్య ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా కొత్త షెడ్యూల్ ఈ కారణంగానే వాయిదా పడింది. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్కి కూడా హాజరుకాలేకపోయారు. ఇటీవల పుణ్య క్షేత్రాల దర్శనాలు చేశారు. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో తెలిపింది. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో శనివారం రాత్రి పవన్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
స్కానింగ్తోపాటు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు కొన్ని సూచనలు చేశారని సమాచారం. ఆరోగ్యం విషయంలో పూర్తి అవగాహన కోసం మరికొన్ని వైద్య పరీక్షలు అవసరముంది అని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఉన్నందున, ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఆయన మిగతా పరీక్షలను చేయించుకోనున్నారు. పవన్ కల్యాణ్ గత కొన్నేళ్లుగా సయాటికాతో ఆధపుతున్నారు. దాని కోసం ఆయన వైద్యం తీసుకుంటున్నారు కూడా.
దీని కారణంగా కూడా ఆయన సినిమాల షూటింగ్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఆయన సినిమాలకు అడ్డు అవుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే ఆరోగ్యానికి మంచిది అని కేరళ, తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారని జనసేన వర్గాల సమాచారం. కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలసి ప్రయాగరాజ్కు వెళ్లి కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించి వచ్చారు.
దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడింది అని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు హాస్పిటల్కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే 24 నుండి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు పవన్ హాజరవుతారని ఆయన కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ వైద్య పరీక్షల విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. చూద్దాం పవన్ బయటకు వచ్చి ఏమన్నా చెబుతారేమో.