చిరంజీవి (Chiranjeevi) – మహేష్ బాబును (Mahesh Babu) ఆ మధ్య ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజీ మీద చూసి వావ్ అనుకున్నారు ఫ్యాన్స్. ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే వచ్చే వైబ్ ఆ లెవల్లో ఉంటుంది మరి. అయితే ఆ ఇద్దరూ తెర మీద ఒకే ఫ్రేమ్లో కనిపించే ఛాన్స్ మనం మిస్ అయ్యామా? ఏమో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ఇటీవల ఆయన ‘ఏ మాయ చేసావె’ సినిమా గురించి మాట్లాడారు. ఈ క్రమంలో సినిమాను తొలుత ఎవరితో చేయాలని అనుకున్నారు అనే విషయం గురించి మాట్లాడారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సినిమా పరిశ్రమలో ఎప్పుడూ జరిగేది, మనం ఎప్పుడూ చెప్పుకునే మాటే. ఎవరి కోసం పుట్టిన కథ, ఎవరికి రాసిపెట్టిన కథ వారి వద్దకే చేరుతుంది. ఎన్ని చేతులు మారినా చివరికి రావాల్సిన వారి చేతుల్లోకి వస్తుంది. మధ్యలో జరిగే ప్రయాణం గురించి తర్వాత మాట్లాడుకుంటాం. అలా ‘ఏ మాయ చేసావె’ ప్రయాణం గురించి గౌతమ్ మీనన్ ఇటీవల చెప్పుకొచ్చారు. నాగచైతన్య ఆ సినిమా చేసే ముందు కథను ఓ స్టార్ హీరో తనయుడు, మరో స్టార్ హీరోకు చెప్పానని.. అయితే ఆయన మన కాంబినేషన్లో మరో స్టైల్ కథ ఉంటే బాగుంటుందని అనడంతో ఆపేశాను అని చెప్పారు.
తెలుగులో ‘ఏ మాయ చేసావె’ సినిమాను నిర్మించిన కుటుంబానికి చెందిన స్టార్ హీరోతోనే ఆ సినిమా తీయాలనుకున్నానని చెప్పారు గౌతమ్ మీనన్. ఆ సినిమాను నిర్మించిన ఫ్యామిలీ అంటే ఘట్టమనేని కృష్ణ కుటుంబమే. అంటే మహేష్ బాబే ఆ స్టార్ హీరో. అలా మహేష్ (Mahesh Babu) ఆ సినిమాను వదులుకోవడమే కాదు. చిరంజీవితో (Chiranjeevi) ఓ సీన్లో నటించే అవకాశం కూడా వదులుకున్నాడు. ఎందుకంటే ఆ సినిమాలో హీరో సినిమాల్లో అసిస్టెంట్ డైరక్టర్.
ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాగా చూపించాలని గౌతమ్ మేనన్ అనుకున్నారట. షూటింగ్లో హీరో డిస్టర్బ్డ్గా ఉండటం చూసి ఏమైంది అని చిరంజీవి అడుగుతాడని, తన ప్రేయసి పెళ్లి జరుగుతోందని చెబితే వెంటనే తన హెలికాఫ్టర్ ఇచ్చి పంపించేలా సీన్ రాసుకున్నారట గౌతమ్ మీనన్. అంటే మనం ఆ సీన్, ఫ్రేమ్ మిస్ అయినట్లే కదా.