సినిమా అన్నాక ట్రోలింగ్ తప్పనిసరి అనేలా తయారైంది పరిస్థితి. థియేటర్లలో మంచి విజయం అందుకున్న సినిమాకు కూడా ట్రోలింగ్ తప్పడం లేదు. అలాంటిది థియేటర్లలో ఇబ్బందికర ఫలితం అందుకున్న సినిమా అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటోంది. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ అనుకుంటున్నారా? తెలుగు సినిమా చరిత్రలో భారీ హైప్తో రిలీజ్ అయి.. భయంకరంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ సినిమానే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఓటీటీ విడుదల తేదీని నెట్ఫ్లిక్స్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో సినిమాను ముక్క ముక్కలుగా చూసి ప్రతి పాయింట్ని ఏకి పారేసే నెటిజన్లు ఇక తమ పని స్టార్ట్ చేసేస్తారు అని కచ్చితంగా చెప్పేయొచ్చు. మామూలుగా అయితే సోషల్ మీడియాలో హడావుడిగా ఉండే దర్శకుడు హరీశ్ శంకర్ ఇప్పుడు మరోసారి ఆ వేడిని ఫేస్ చేస్తారు. థియేటర్ విడుదల సమయంలోనే చాలా మంది నెటిజన్లు ఏకి పడేశారు. అప్పుడు హరీశ్ శంకర్ చాలా వరకు కౌంటర్ ఇచ్చారు. మరిప్పుడు ఏం చేస్తారో చూడాలి.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కథ విషయానికొస్తే.. నల్లమల అడవిలోని ఓ గూడెంలో పాఠాలు బోధించేందుకు చంద్రశేఖర్ రావు (కె.ఎస్.రవికుమార్) అనే మాస్టారు వస్తారు. అక్కడి వారి కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. కూలి పనులకు వెళ్లే పిల్లలు మళ్లీ చదువుల కోసం బడి బాట పట్టేలా చేస్తారు. ఆ ఊళ్లోనే పుట్టి పెరిగి అనాథగా ఉన్న చిన్నయ్యని చేరదీసి సంరక్షకుడిగా మారి చదువు చెప్పిస్తాడు. ఆ కుర్రాడి భావాలు, ఆవేశం గ్రహించి భగత్ సింగ్ అని పేరు పెడతాడు.
ఆ తర్వాత ఆ మాస్టారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. చిన్నప్పటి భగత్ సింగ్ పెద్దయ్యాక ఏసీపీ (పవన్ కల్యాణ్) అవుతాడు. ముఖ్యమంత్రికి రక్షణగా ఉంటుంటాడు. అయితే అసాంఘిక శక్తులతో సంబంధాలున్న చెదలమర్రి నల్లనాగప్ప (పార్తిబన్) సీఎం పీఠంపై కన్నేస్తాడు. చంద్రశేఖర్రావుని అంతం చేయాలని పథకం రచిస్తాడు. నల్లనాగప్పని ఏసీపీ భగత్ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే సినిమా కథ.