నితిన్.. అర్జెంట్గా హిట్ కావాల్సిన హీరో. టాలీవుడ్లో వరుస ఫ్లాప్లు అందుకుంటున్న ఆయన.. ఇప్పుడు ఓ హిట్ సినిమా దర్శకుడితో తన కొత్త సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయనే వీఐ ఆనంద్. గతేడాది ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆయన.. ఇటీవల నితిన్కి ఓ కథ వినిపించారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.
వైవిధ్యమైన కథలతో సినిమాలు తెరకెక్కించే వీఐ ఆనంద్కి కమర్షియల్ సక్సెస్ అందుకున్న సినిమాలు లైనప్లో తక్కువగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఏడు సినిమాలు తీస్తే.. అందులో రెండు మాత్రమే మంచి విజయాలు అందుకున్నాయి. ఒకట్రెండు ఫర్వాలేదు అనిపించాయి. అయితే కథల జోనర్, చెప్పే విధానం కొత్తగా ఉంటుంది. ఎక్కువగా థ్రిల్లర్ అంశాలను ఎంచుకుంటున్నారు. అందుకే సినిమాల కమర్షియల్ సక్సెస్ ఎలా వున్నా, కొత్తగా ప్రయత్నిస్తారు అనే పేరు సంపాదించారు.
అలాంటి ఆయన హరర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ వదిలేసి సైన్స్ ఫిక్సన్ రూట్ ఎంచుకున్నారట. డబుల్ రోల్ హీరో.. ఇద్దరి మధ్యలోని సైంటిఫిక్ సమస్యకు సినిమాకు కీలకంగా ఉంటుందట. ఈ పాయింట్ నచ్చే నితిన్ సినిమా విషయంలో ముందుకెళ్దామని ఫిక్స్ అయ్యారట. ‘తమ్ముడు’ సినిమా తరువాత నితిన్ తన కొత్త సినిమా గురించి ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ‘ఎల్లమ్మ’ సినిమా చేస్తాడనే వార్తలొచ్చినా ఆ సినిమా నుండి తప్పుకున్నాడట.
మరిప్పుడు వీఐ ఆనంద్ సినిమా అనుకున్నట్లుగా ముందుకెళ్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. నితిన్కి విజయాలు లేవు. ఈ సమయంలో నిర్మాత అంత రిస్క్ చేస్తారా? ఒకవేళ చేస్తే నితిన్ – వీఐ ఆనంద్ అనుకున్న స్థాయిలో ఔట్పుట్ ఇచ్చి సినిమాతో విజయం అందుకుంటారా అనేది చూడాలి. ఇక నితిన్ వద్దనుకున్న / దూరమైన ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ నటిస్తారని సమాచారం.