Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్కి రెడీ.. ఈసారైనా అవుతుందా?
- May 1, 2026 / 02:29 PM ISTByFilmy Focus Desk
ఓ సినిమాకు సినిమా కష్టాలు వచ్చి వారం, నెల ఆగితేనే ఏదో అయిపోయినట్లు నానా యాగీ అయిపోతున్న రోజులివి. అలాంటిది ఓ సినిమా షూటింగ్ మొదలుపెట్టి పూర్తయిపోయి సుమారు 10 ఏళ్లు అయిపోయింది. తరచూ ఆ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు రెడీ అవ్వడం, ఏదో సమస్య వచ్చి ఆగిపోవడం లాంటివి చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు సినిమాను రిలీజ్ చేయడానికి ఓ దారి కనిపించింది. జూన్ 15లోగా సినిమాను రిలీజ్ చేసుకోండి. దాని కోసం ఏర్పాట్లు చేసుకోండి అంటూ మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Dhruva Natchathiram
అన్నేళ్లుగా ఇబ్బందులు పడిన సినిమా విక్రమ్ – గౌతమ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ‘ధృవనక్షత్రం’. ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జూన్ 15 లేదా అంతకన్నా ముందు విడుదలకు వీలు కల్పిస్పూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ‘కొండాడువోమ్ ఎంటర్టైన్మెంట్’ అనే సంస్థ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని సూచించింది. ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలను ఆ ఖాతా ద్వారానే జరగాలని ఆదేశించింది. ఈ వ్యవహారాలను ఓ న్యాయవాది పర్యవేక్షిస్తారని తెలిపింది.

ఒకవేళ ఈ మేరకు చేసిన ప్రయత్నాలు నెరవేరక జూన్ 15లోగా సినిమాను విడుదల చేయడం సాధ్యంకాకపోతే కోర్టును మరోసారి సంప్రదించి, సమయం కోరవచ్చని చెప్పింది. దీంతో ఈ సారి సినిమా విడుదల అవ్వొచ్చు అనే ఆశలు కలుగుతున్నాయి. 2016లో ప్రారంభమైన ‘ధృవనక్షత్రం’/ ‘ధృవ నటచిత్రం’ సినిమాను 2017లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు దర్శకుడు గౌతమ్ మీనన్. కానీ ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఒక సమయంలో గౌతమ్ మీనన్, విక్రమ్ చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు.
ఇక 2023లో ఈ సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకుని రూ.2.40 కోట్లు తీసుకున్నారని.. కానీ సినిమాన పూర్తి చేయలేదని ఫిర్యాదు వచ్చింది. తమ డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నగదు తిరిగి ఇవ్వకుండా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసే అవకాశం ఇవ్వొద్దు అంటూ ఆల్ ఇన్ పిక్చర్స్ కోరింది. అప్పటి నుండి మళ్లీ సినిమా విడుదల పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది.











