పగోడికి కూడా రాకూడని కష్టం.. అని అంటుంటారు కదా. ఇలాంటి కష్టమే ఇప్పుడొచ్చింది ‘అఖండ 2: తాండవం’ సినిమాకు. అంతా ఓకే.. మరో రోజులో థియేటర్లలో అభిమానుల ఆనంద తాండవం పక్కా అనుకుంటగా.. ఎప్పుడో పదేళ్ల నాటి సినిమా పంచాయితీ ఒకటి వచ్చి.. మొత్తం ఆనందాన్ని చెరిపేసింది. ఆ సినిమాకు బాలకృష్ణకు ఏమన్నా ఉందా అంటే అస్సలు లేదు. కానీ ఇబ్బందిపడ్డారు. ఎరోస్తో వచ్చిన ఆ సమస్యను ఫిక్స్ చేసుకొని ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు మరో ప్రశ్న మొదలైంది.
‘అఖండ 2: తాండవం’ సినిమాను ఈ నెల 12న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. 11వ తేదీ రాత్రి ప్రత్యేక ప్రీమియర్లతో ఈ సినిమా స్క్రీనింగ్ మొదలుకానుంది. అంటే సినిమా టీమ్కి ప్రచారం కోసం గట్టిగా చూస్తే ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారం కోసం ఏం చేస్తారు అనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే డిసెంబరు 4 వరకు సినిమా కోసం బాగా ప్రచారం చేశారు. ఉన్న ఆప్షన్లు అన్నీ వాడేశారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేసే సమయం కూడా లేదు.

కాబట్టి.. సోషల్ మీడియా ప్రచారం మాత్రమే సాధనంగా మారింది. వన్స్ సినిమా వచ్చేస్తే ఇప్పుడు ఇంకా ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే మౌత్ టాక్ తన పని తాను చేసేస్తుంది. కాబట్టి ఈ ఒకటిన్నర రోజు అదే పనిలో ఉండాలి. మరోవైపు ఎరోస్ కేసు, ఆ తర్వాత ఆర్థిక విషయాలు సినిమాకు ప్రచారం తీసుకొచ్చాయి. ఒక విధంగా ఈ వ్యవహారం ఇబ్బంది పెట్టినా పాన్ ఇండియా లెవల్ ప్రచారం అయితే తీసుకొచ్చాయి. కాబట్టి సినిమా టీమ్ పెద్దగా ఇబ్బంది పడిందేం లేదు.
అయితే, సమస్యల్లా ఈ సినిమా వారం వాయిదా పడటంతో డిసెంబరు 12న రావడానికి సిద్ధమైన ఇతర చిన్న సినిమాలు ఇప్పుడు వాయిదా బాట పట్టాయి.
